కోల్కతా : పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ముకుల్ రాయ్తో పాటు ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్.. సీఎం మమతా బెనర్జీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మ. 3 గంటలకు మమత సమక్షంలో వారిద్దరూ టీఎంసీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ గురువారం నిర్వహించిన సమావేశానికి ముకుల్ రాయ్ హాజరు కాలేదు. 2017లో టీఎంసీని వీడిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా సేవలందించారు.