గణపురం, డిసెంబర్ 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో ముద్ర లోన్లు ఇస్తామని నమ్మించి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పొదుపు పేరిట డబ్బులు వసూలు చేసి రూ.50 లక్షలతో ‘ముద్ర అగ్రికల్చర్’ సంస్థ బోర్డు తిప్పేసింది. బాధితుల కథనం ప్రకారం.. గణపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ‘ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్.. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ పేరిట బోర్డు ఏర్పాటు చేశారు. దీనికి బ్రాంచ్ మేనేజర్, సిబ్బందిని నియమించుకొని లోన్లు ఇస్తామని రైతులు, దుకాణ యజమానులు, మహిళలను నమ్మించారు. రూ.5 వేల నుంచి రూ.పది వేల వరకు లోన్ ఇచ్చారు. పొదుపు పేరిట నగరంపల్లివాసులు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన పలువురి నుంచి దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.