ప్రభుత్వ సంకల్పానికి అధికారుల సృజన తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. పాలన పరిఢవిల్లుతుంది. సమాజంలో ప్రగతి వెల్లివిరుస్తుంది. ఈ సూత్రాన్ని అక్షరాలా ఆచరించి చూపారు వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి ఎంపీడీవో గుంటి పల్లవి. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును ఆమె కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. గ్రామాలకు అద్భుత శోభను అద్దుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలో పల్లవి ప్రత్యేక చొరవతో విభిన్న తరహాలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. మైసంపల్లిలో వినాయక వనాన్ని ఏర్పాటుచేసి వినాయక చవితి నవరాత్రి పూజల్లో ఉపయోగించే పూలు, ఆకులు, పండ్ల మొక్కలతో పార్కును రూపొందించారు. శివాజీనగర్లో రాశులు-నక్షత్ర వనాన్ని, వెంకటాపురంలో సప్తరుషి వనాన్ని, చలపర్తిలో పంచతత్వ పార్కు, నాచినపల్లిలో గ్రీన్ రామాయణ్ పార్కు, పీజీ తండాలో 50 రకాల మొక్కలతో బటర్ ఫ్లై పార్కును ఏర్పాటుచేశారు.
అందరి మద్దతుతోనే
మొక్కల పెంపకాన్ని అందరూ ఇష్టంతో చేయాలనే ఆలోచనతోనే హరితహారంలో కొన్ని భిన్నమైన కార్యక్రమాలు చేయగలిగాను. మా కలెక్టర్ హరిత మేడం, మండలంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ప్రజల సహకారంతోనే ఇది జరుగుతున్నది. పల్లె వాతావరణం బాగుండాలనే ఆలోచనతో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రజలకు ఉపయోపడే ఔషధ, పండ్లు, పూల మొక్కలను పెంచేందుకు నా వంతుగా ప్రయత్నించాను. ఉత్తరేణి, అశ్వగంధ, కృష్ణ తులసి, గరక వంటి గ్రామాల్లో అందుబాటులో ఉండే మొక్కలనే ఎంపిక చేసుకున్నాం.