తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా తిమ్మక్క చేతుల మీదుగా సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డును ఎంపీ సంతోష్ కుమార్ అందుకున్నారు.
సాలుమారద తిమ్మక్క ఇంటర్నేషనల్ ఫౌండేషన్, శ్రీ సిద్ధార్ధ ఎడ్యుకేషనల్ సొసైటీ కలిసి 2020 సంవత్సరానికి గాను దేశంలో అత్యుత్తమ సామాజిక సేవలు అందిస్తున్నవారికి అవార్డులను అందజేసింది. ఈ అవార్డుల్లో ప్రకృతి పరిరక్షణ విభాగంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో అత్యుత్తమ ప్రకృతి సేవకురాలు, ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలోని కమిటీ తనను ఇంతటి అద్భుతమైన సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డుకు ఎంపిక చేయడం తన పూర్వజన్మ సుకృతం అయిందన్నారు. సీఎం కేసీఆర్ నడిచిన బాటలో అడుగులో అడుగేస్తూ.. తన వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో సరిగ్గా ఐదేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపారు. చిన్న ప్రయత్నంతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఇవాళ వివ్వ వ్యాప్తం అయిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన ప్రతీఒక్కరికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
తనతోపాటు అవార్డును అందుకున్న ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ పద్మశ్రీ కిరణ్ కుమార్, ప్రముఖ నిర్మాత రంగనాథ్ భరద్వాజ్, ప్రముఖ విద్యావేత్త, రచయిత గురురాజా కరజ్జయిని, సత్యామోర్గానికి సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి గంగాధరయ్య పరమేశ్వరతో పాటు సిద్ధార్థమఠం పీఠాధిపతి హొరనహళ్లి శ్రీశ్రీ సద్గురు శంకరానంద మహాస్వామి, ఇతర పీఠాధిపతులు, సాలుమారద తిమ్మక్క ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.