పటాన్ చెరు : ప్రభుత్వ దవాఖానాల్లో సకాలంలో ఉచితంగా నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50లక్షల అంచనా వ్యయంతో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు, పేద వారికి, నాణ్యమైన వైద్యం అందిస్తుందన్నారు. గుమ్మడిదల, జిన్నారం, బొల్లారం, పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు ఈ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
పటాన్ చెవు నియోజకవర్గంలో డాక్టర్లు, ఆశావర్కర్లు శ్రద్ధతో పని చేస్తున్నారంటూ అభినందించారు. సీఎం పేదల పక్షపాతి అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జిల్లాలో మొదటి తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ పటాన్చెరులో ప్రారంభించామని, ఈ మేరకు మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.300 కోట్ల వ్యయంతో పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేశారని, త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన చేసుకుంటామన్నారు.