హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. చెరుకును చేర్చుకునే విషయంలో రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై ఆయన ముఖం చేసేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని చెప్పారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ నేడు కాంగ్రెస్పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పైవిధంగా స్పందించారు.
కాగా, ఎంపీ కోమటిరెడ్డి తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని పార్టీ అధినేత్రికి లేఖద్వారా వివరించారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన విషయం విధితమే. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తనకు క్షమాపణ చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.