హైదరాబాద్: కాంగ్రెస్లో చండూరు సభ పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్పై చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. అయినా తగ్గేదిలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat reddy) అంటున్నారు. చండూరు సభలో తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన అద్దంకి దయాకర్పై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
రేవంత్ క్షమాపణ చెప్పిన విషయం తన దృష్టికి రాలేదని ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. క్షమాపణ చెబుతూ శనివారం ఉదయం ట్విట్టర్లో రేవంత్ రెడ్డి ఓ వీడియో షేర్ చేశారు. అయితే అది తాను చూడలేదని, వినలేదని తెలిపారు. తనపై వాడరాని పదం వాడిన వారిని సస్పెండ్ చేయాల్సిందేనని అద్దంకి దయాకర్ను ఉద్దేశించి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొనే ఆలోచన లేదని చెప్పారు.