న్యూఢిల్లీ: దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఓ హోటల్ రూమ్లో ఇటీవల ఆయన శవమై తేలారు. ఈ అంశం గురించి ఇవాళ లోక్సభలో ప్రశ్నించారు. శివసేన ఎంపీ వినాయక్ రౌత్ దీని గురించి మాట్లాడారు. ఎంపీ మోహన్ దేల్కర్ 35 ఏళ్ల పాటు పార్లమెంట్కు హాజరయ్యారన్నారు. అయితే స్థానిక అధికారులు ఆయన్ను వేధించడం వల్లే ఎంపీ దేల్కర్ సూసైడ్ చేసుకున్నట్లు వినాయక్ రౌత్ ఆరోపించారు. ఎంపీ దేల్కర్ రాసిన సూసైడ్ నోట్ను పరిశీలిస్తే, ఆయన ఎంత అవేదనకు గురయ్యారో అర్థం అవుతుందని శివసేన ఎంపీ లోక్సభలో పేర్కొన్నారు. ఏడు సార్లు ఎంపీగా చేసిన దేల్కర్ మృతిచెందిన ఘటనపై దర్యాప్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. స్థానిక అడ్మినిస్ట్రేటివ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎంపీ దేల్కర్ 16 పేజీల సూసైడ్ నోట్ రాశారని, ఆ లేఖలో డజన్ల సంఖ్యలో అధికారుల పేర్లు ఉన్నాయని, ఆ విషయాన్ని పరిశీలించాలని జేడీయూ సభ్యుడు కౌశలేంద్ర కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. దాద్రానగర్ హవేలీలోని అధికారులు తక్షణమే తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు జేడీయూ నేత సభలో తెలిపారు. దేల్కర్ సూసైడ్ కేసులో ఏటీఎస్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. ఎస్పీ, కలెక్టర్ను తక్షణమే తొలగించి, ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం విచారించాలని ఎంపీ వినాయక్ రౌత్ డిమాండ్ చేశారు.