భోపాల్ : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ గ్యాస్ విషాద బాధిత వితంతువులకు రూ.వెయ్యి అదనంగా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. రూ.వెయ్యి గ్యాస్ లీకేజీ బాధితుల్లో బ్రతికి ఉన్న వితంతువులకు సామాజిక భద్రత పెన్షన్కు అదనంగా అందుతుందని మిశ్రా సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో అదనపు పెన్షన్ను నిలిపివేసిందని చెప్పారు. 2013లో బీజేపీ ప్రభుత్వం పెన్షన్ను ప్రారంభించిందని, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ నిర్ణయంపై ఎన్జీఓ భోపాల్ గ్రూఫ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్కు చెందిన రిచ్నా ధింగ్రా మాట్లాడుతూ 2019 నుంచి గ్యాస్ లీకేజీ బాధితులకు పెన్షన్ రాలేదని, బకాయిలు సైతం వెంటనే చెల్లించాలని ఆమె కోరారు. విషాద బాధితుల అవసరాలపై అవగాహన లేక గ్యాస్ రిలీఫ్ డిపార్ట్మెంట్ విధానంలో స్పష్ట లేదన్నారు. భోపాల్ శివారులో ఉన్న యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్కు చెందిన పురుగుల మందు ప్లాంట్ నుంచి 1984, డిసెంబర్ 2-3 తేదీల మధ్య మిథైల్ ఐసోసైనేట్ లీక్ కావడంతో 15వేల మంది మరణించారు. విషపూరిత గ్యాస్ లీకేజీ కారణంగా ఐదులక్షలకుపైగా జనం ప్రభావితమయ్యారు.