ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని వరద బాధితులకు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అండగా నిలిచారు. బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో అనేక గ్రామాలు నీటమునగడంతో అక్కడి పేదలు సర్వం కోల్పోయారు. గోదావరి ఉగ్రరూపం వల్ల జరిగిన నష్టం గురించి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.. ఎంపీ బండి పార్థసారథిరెడ్డికి వివరించడంతో వెంటనే స్పందించి రూ.1,01,45,000 ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బుతో వరద బాధితులకు శనివారం నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఎంపీలు బండి పార్థసారథిరెడ్డి, కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలో సరుకులు అందజేశారు. నియోజకవర్గంలో 15 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించనున్నారు.
తెలంగాణలో వరద బీభత్సానికి ఎన్నో గ్రామాలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. కేంద్రం పట్టించుకోకపోయినా సీఎం కేసీఆర్ భద్రాచలం ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి రూ.1,000 కోట్ల సాయం అందించారని మణుగూరులో తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.