వికారాబాద్ : భర్త పెట్టే బాధలు భరించలేక ఓ తల్లి ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలో ఒక పాప మృతి చెందగా.. మరో పాప ఆచూకీ లభ్యం కాలేదు. తల్లి ప్రాణాలతో పోరాడుతున్నది. ఈ హృదయ విదాకర సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లీపూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి బంటారం మండలం కేంద్రానికి చెందిన సొంత మేన బావ గోపాల్ కి ఇచ్చి మూడు సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. గత రెండు సంవత్సరాలుగా భాగ్యలక్ష్మి వికారాబాద్ మహవీర్ హాస్పిటల్లో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. వీరికి కృపా, శ్రేష్ట ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. గోపాల్ నిత్యం తాగి భార్య వద్ద ఉన్న డబ్బులు తీసుకొని వేధించేవాడు. దీంతో విసుగు చెందిన భార్య శుక్రవారం శివసాగర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన స్థానికులు వెంటనే చెరువులో దూకి వారిని రక్షించే ప్రయత్నం చేయగా.. చిన్న పాప శ్రేష్ట(9 నెలలు) మృతి చెందగా కృపా ఆచూకీ లభ్యం కాలేదు. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతుంది. డీఎస్పీ సంజీవరావు ఆధ్వర్యంలో పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.