మెదక్: జిల్లాలోని రామాయంపేటలో (Ramayampet) విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్ తల్లీ కొడుకులు. ప్రేమ విఫలమవడంతో శివకుమార్ మూడు రోజుల క్రితం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో వరలక్ష్మి తీవ్రమనస్థాపానికి గురైంది. అయితే శివకుమార్ మృతిని తట్టుకోలేక శుక్రవారం ఉదయం చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులోనుంచి ఆమె మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.