హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి గంటకు సగటున 50 మంది మృత్యువాత పడుతుంటారు. గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో నాలుగు లక్షల మందికిపైగా మరణించారు. వీరిలో అత్యధికంగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య జరిగిన ప్రమాదాల్లో మరణించినట్టు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)-2021 నివేదిక వెల్లడించింది. ప్రతి రోజు 24 గంటల వ్యవధిలో జరిగే రోడ్డు ప్రమాదాలను విశ్లేషించిన ఆ నివేదిక సాయంత్రం 6 9 గంటల మధ్య 81,410 మంది మృత్యువాతపడినట్టు పేర్కొంది.
ఆ తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరిగిన ప్రమాదాల్లో 71,711 మంది మృతిచెందినట్టు పేర్కొన్నది. ప్రధానంగా సాయంత్రం 6 గంటల నుంచి వాతావరణంలో మార్పు రావడం, వెలుతురు క్రమంగా తగ్గడం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడానికి ఓ ప్రధాన కారణంగా వెల్లడించింది. పగలు స్పష్టంగా వెలుతురు ఉన్న పరిస్థితి నుంచి సాయంత్రానికి క్రమంగా చీకటి పడటం.. వెలుతురు తగ్గినట్టు తెలుసుకొని దానికి తగినట్టుగా లైట్లు వేసుకోకపోవడం.. డ్రైవర్ల అలసట రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో అతివేగం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు, మృతుల సంఖ్య పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.