ముంబై : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముంబైలో ఆయన కుటుంబానికి బాంద్రా – కుర్లాలో రూ.200కోట్ల విలువైన ప్లాట్ను ఉన్నట్లు గుర్తించారు. ప్లాట్ను మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా 2006లో ప్లాట్ను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మాలిక్ కుమారుడు ఫరాజ్ ప్లాట్ ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలో భాగస్వామి. అంతకు ముందు సోమవారం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాల సంబంధాలున్నాయని మనీలాండరింగ్ కేసులో ఫరాజ్కు ఈడీ సమన్లు జారీ చేసింది.
అయితే, ఫరాజ్ విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం నవాబ్ మాలిక్ ఈడీ కస్టడీలో ఉండగా.. రేపటితో గడువు ముగియనున్నది. అయితే, తన అరెస్టు చట్టవిరుద్ధమని, వెంటే విడుదల చేయాలని కోరుతూ నవాబ్ మాలిక్ సోమవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన అక్రమ నగదు చలామణీ కార్యకలాపాల్లో నవాబ్ మాలిక్కు సంబంధాలున్నాయని గత బుధవారం ఈడీ అరెస్టు చేసింది. అయితే, ఈ కేసును సైతం కొట్టి వేయాలని కోర్టును కోరారు.
ఈడీ కేసు, ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐర్లో పేర్కొన్న నిందితుల్లో ఎవరితోనూ సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు, సమన్లు లేకుండా బలవంతంగా ఈడీ అధికారులు తనను ఇంటి నుంచి తీసుకెళ్లారని ఆరోపించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 23న జారీ చేసిన ఉత్తర్వు అధికార పరిధి లేకుండా ఉందని మంత్రి పేర్కొన్నారు.
దావూద్ ఇబ్రహీం అనుచరులు హసీనా పార్కర్, సలీం పటేల్, సర్ధార్ ఖాన్లతో కలిసి మాలిక్.. మునీరా ప్లంబర్ అనే దావూద్ గ్యాంగ్ బాధితురాలికి చెందిన రూ.300 కోట్లు విలువైన ఓ ప్రైమ్ ప్లాట్ను మంత్రి నవాబ్ మాలిక్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. సాలిడస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఆ ప్లాట్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ కంపెనీ నవాబ్ మాలిక్ కుటుంబానికి చెందినది కాగా.. డీ గ్యాంగ్ (దావూద్ ఇబ్రహీం గ్యాంగ్) సభ్యుల క్రియాశీలక సహకారంతో మాలిక్ దీన్ని నిర్వహిస్తున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.