న్యూఢిల్లీ: దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) సుశీల్చంద్ర అన్నారు. ఇవాళ జరిగిన నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొత్తం ఓటర్లలో 49 కోట్ల మంది పురుషులు, 46 కోట్ల మంది మహిళలు ఉన్నారని ఆయన చెప్పారు. మరో 1.92 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు (60 ఏండ్లు పైబడినవారు) ఉన్నారని సీఈసీ వెల్లడించారు.
దేశానికి స్వాతంత్రవచ్చిన నాటి నుంచి భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ఇస్తున్న గౌరవంగా భావిస్తూ వస్తున్నారని సీఈసీ సుశీల్ చంద్ర చెప్పారు. కేవలం 18 శాతం అక్షరాస్యత ఉంది, కొత్తగా స్వాతంత్య్రం సాధించుకున్న దేశం వేగవంతమైన అభివృద్ధికి ఈ రైట్ టు ఓట్ ఎంతో తోడ్పడిందని ఆయన చెప్పారు.
ఇక, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని సుశీల్ చంద్ర తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తిచేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు.