Omicron Effect : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో దశలవారీగా రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలుకు ఎల్లో అలర్ట్ జారీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కొవిడ్-19 పరిస్ధితిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఎల్లో అలర్ట్లో భాగంగా థియేటర్లు, మల్లీప్లెక్స్లు మూతపడనుండగా రెస్టారెంట్లను 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకునేందుకు అనుమతిస్తారు.
రాత్రి పదిగంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. స్పాలు, జిమ్లు, యోగ ఇనిస్టిట్యూషన్స్ మూతపడతాయి. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో కొవిడ్-19 పాజిటివిటీ రేటు 0.5 శాతం పైన ఉండటంతో ఎల్లో అలర్ట్ను అమలు చేస్తున్నామని నియంత్రణలపై సవివర ఉత్తర్వులను త్వరలో జారీ చేస్తామని భేటీ అనంతరం సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు.
తాజా కొవిడ్-19 కేసుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, కేసుల సంఖ్య పెరిగినా ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల వాడకంలో ఎలాంటి పెరుగుదల లేదని వివరించారు. ఇక కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం ఎగువన ఉంటే యల్లో అలర్ట్ జారీ చేస్తారు. ఢిల్లీలో గత రెండు రోజులుగా వరుసగా 0.5 శాతం ఎగువన కొవిడ్ పాజిటివిటీ రేటు నమోదవుతోంది. ఢిల్లీలో సోమవారం జూన్ 9 తర్వాత గరిష్ట స్ధాయిలో 331 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి.