యాదాద్రి, అక్టోబర్ 2 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంతోపాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక తిరుమంజనం జరిపారు. అమ్మవారికి దివ్యాభరణాలు, నూతన క్షోమ వస్ర్తాలను ధరింపజేసి దివ్యాభరణ శోభితంగా ఆస్థానంలో వేంచేపు చేశారు. బ్రాహ్మణులందరినీ ఆహ్వానించి ఋత్విగ్వరణం, విశ్వక్సేనారాధనలు, పుణ్యాహవాచనం, రక్షాబంధనంతోపాటు పారాయణాలు, జపాలు జరిపారు. ఆండాళ్ అమ్మవారికి కుంకుమార్చన, సహస్రనామార్చనతోపాటు స్వర్ణ పుష్పార్చన కైంకర్యాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం మంత్ర పుష్పనీరాజనాలతో మూల నక్షత్ర పూజలు విశేషంగా చేపట్టారు.
త్రికాలములయందు త్రిశక్తిస్వరూపురాలైన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. యాదాద్రి క్షేత్రంలో వంద ఏండ్లుగా అమ్మవారికి మూల నక్షత్ర పూజాదులు జరుపుతున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ప్రధానాలయ పునః ప్రారంభానంతరం మొదటిసారిగా జరిగిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం నుంచి ప్రాతఃకాల పూజ, పారాయణాలు, సరస్వతీ పూజ, సహస్రనామార్చన, పారాయణాలు, మధ్యాహ్న పూజ, సాయంత్రం నవావరణ పూజ, నీరాజన మంత్ర పుష్పం, కుంకుమార్చన, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా రామలింగేశ్వరస్వామి ఆలయంలో చండీహోమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, డీఈఓ దోర్భాల భాస్కర్శర్మ పాల్గొన్నారు.
కిక్కిరిసిన యాదాద్రి క్షేత్రం..
యాదాద్రి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. దసరా పండుగ నేపథ్యంలో వివిధ గ్రామాలకు వెళ్తున్న వారు స్వామివారిని దర్శించుకునేందుకు రావడంతో ఆలయ ప్రాంగణాలు నిండిపోయాయి. యాదాద్రి మాఢవీదులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రధానాలయంలో భక్తుల రద్దీ కనిపించింది. కొండ కింద నిర్మితమైన కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మ దర్శానికి 2గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం జరిపారు. లక్ష్మీనరసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిపారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండ కింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని సుమారు 11,412 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.30,38,104 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.