జెనివా : రోజులు గడిచిన కొద్దీ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలకు వైరస్ పాకిందని, వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు, కాంటాక్టులను గుర్తించాలని ఆయా దేశాలకు టెడ్రోస్ సూచించారు. కొన్ని దేశాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసులు రికార్డవుతున్నట్లుగా నివేదికలు అందుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలు మంకీపాక్స్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు సమర్థవంతమైన మార్గాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సూచించారు. వైరస్ సోకిన వ్యక్తితో కలిసి ఇంట్లో ఉంటే.. వారితో సన్నిహతంగా ఉండొద్దన్నారు. మంకీపాక్స్కు యాంటీవైరల్, వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, కానీ పరిమిత సరఫరాలో ఉన్నాయన్నారు. మంకీపాక్స్కు వ్యతిరేకంగా టీకాలు వేసే దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ప్రయోగశాల సిబ్బంది అధిక ముప్పు ఉన్న వారికి టీకాలు వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, ఇతర ఆరోగ్య పరిస్థితుల్లో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులతో సహా బలహీన రోగనిరోధక శక్తి ఉన్న వారికి వేయనున్నారు. మంకీ పాక్స్ సోకితే.. ఆరు నుంచి 13 రోజులు.. కొందరిలో 21 రోజుల వరకు లక్షణాలు కనిపించవని నిపుణులు పేర్కొన్నారు. వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, అలసట, శోషరస గ్రంథులు వాపు, చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయని పేర్కొంది.