హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు వేదికైన మొయినాబాద్ ఫామ్హౌస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను తమ అదుపులోకి తసుకున్న పోలీసులు ఫామ్హౌస్నులో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకుని కేసు పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. నిందితులు డబ్బులను ఇంకా ఎక్కడైనా దాచారా అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం కలిగిన ప్రతిచోటును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే అంశంపై ఆరాతీస్తున్నారు. ఇప్పటికే వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారన్న అంశంపై విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలను సేకరించి వారిని కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో స్వామీజీ, నందు, సతీశ్లపై మొయినాబాద్ పోలీసులు.. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం 8, సెక్షన్ 120బీ కింద కేసు నమోదుచేశారు. బీజేపీలో చేరేందుకు రూ.100 కోట్లు డీలింగ్ నడిపినట్లు రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొస్తే రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని, స్వామీజీ, నందు, సతీశ్ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు. డీలింగ్లో భాగంగా తన ఫామ్హౌస్కు వచ్చారని అందులో తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హైదరాబాద్కు వచ్చిన బీజేపీ బ్రోకర్లు రెడ్హ్యాండెడ్గా, డబ్బు సంచులతో సహా పోలీసులకు దొరికిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలోనైతే ఇది ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఒక్క ఓటు తక్కువై ప్రభుత్వాన్నే వదులుకున్న వాజ్పేయి బీజేపీకి, రాష్ర్టాల వారీగా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలు కూలుస్తున్న మోదీ బీజేపీకి ఎంత తేడాఅని రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపిన ఈ వ్యక్తులు ఎవరు అని ఆరా తీసినప్పుడు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ ఎపిసోడ్లో రామచంద్రభారతి కీలకమైన వ్యక్తి అని చెప్తున్నారు. స్వామీజీగా పేరున్న ఈయన బీజేపీ పరివారంలో అతి ముఖ్యుడు. కేంద్ర అధికార నడవాల్లో ఆయనకు తరచూ కనిపిస్తుంటారని, స్వేచ్ఛగా తిరుగుతుంటారనీ, ఆయనను ఎవరూ అడ్డుకోరని రాజకీయ వర్గాలు తెలిపాయి.
కేంద్రంలో కీలక హోదాలో ఉండి, బీజేపీలో నంబర్- 2 గా చక్రం తిప్పుతున్న ప్రముఖుడికి రామచంద్ర భారతి అత్యంత సన్నిహితుడని, కుడి భుజంలాంటి వాడని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. పోలీసుల సమాచారం చెప్పిన దాని ప్రకారం ఆయన స్వస్థలం ఫరీదాబాద్. ఉత్తర కాశీలో ఉన్న కపిలాశ్రమానికి ఆయన అధిపతి. ఈ కుట్రలో పాలు పంచుకున్న మరో స్వామీజీ పేరు వెంకటనాథ సింహయాజి. తిరుపతిలోనూ, కడపలోనూ మంత్రరాజ మఠం పేరుతో ఆయనకు ఆశ్రమాలున్నాయి. ఈ ఇద్దరు స్వామీజీల వద్దకూ కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రముఖులంతా తరచూ వచ్చి వెళ్తున్నట్టు ఫొటో సాక్ష్యాలున్నాయి. ఇక మూడో వ్యక్తి నందు హైదరాబాద్కు చెందిన వ్యాపారి. బీజేపీ వర్గాలకు సన్నిహితుడు. ఆయన హోటల్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. బండి సంజయ్ తదితర బీజేపీ నేతలందరితోనూ నందు దిగిన ఫొటోలున్నాయి.
టీఆర్ఎస్లో షిండేలను సృష్టిస్తామని, కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే రోజు దగ్గర్లో ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా బహిరంగంగానే చెప్తున్నారు. బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ తదితర విపక్ష రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలను ముందే గమనించిన టీఆర్ఎస్ అధిష్ఠానం, బీజేపీ నేతల ప్రకటనలపై మొదలే ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే.. బీజేపీ బ్రోకర్లు టీఆర్ఎస్ నేతలను సంప్రదిస్తున్న సంగతి దృష్టికి వచ్చింది. ఈ పథకంలో భాగంగానే.. నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ రాష్ట్ర అగ్రనాయకులు, ఢిల్లీకి చెందిన నాయకులు మాట్లాడినట్టు తెలిసింది. ‘మీకు ఏమి కావాలన్నా మేం చూసుకుంటాం. పార్టీ మారండి’ అంటూ వారు ఆశ పెడుతూ వచ్చారు. ఈ ఆఫర్లపై నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అగ్రనేతలకు సమాచారమిచ్చారు. పక్కా ప్రణాళికతో బీజేపీ నేతలను తాము పార్టీ మారుతామంటూ నమ్మించారు. అయినా బీజేపీ నేతలు ముందు జాగ్రత్తగా, తాము నేరుగా రంగంలోకి దిగకుండా స్వామీజీలకు బాధ్యతలు అప్పగించారు. స్వామీజీలైతే ఎవరికీ అనుమానం రాదన్నది వారి నమ్మకం.
మరోవైపు ఒకరిద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో హైదరాబాద్కు చెందిన నందకుమార్ మాట్లాడుతూ వచ్చారు. మొత్తమ్మీద సీన్ క్లైమాక్స్కు వచ్చాక.. దీపావళి తరువాత మంచి రోజు చూసి కలుద్దామని అందరూ అనుకున్నారు. బుధవారం మంచి రోజు అని, ఆ రోజు కలుద్దామని, స్వామీజీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందే వేసుకున్న పథకంలో భాగంగా.. అజీజ్నగర్లో తనకు ఫామ్హౌజ్ ఉన్నదనీ, అక్కడ కలిస్తే ఎవరికీ తెల్వదనీ పైలట్ రోహిత్రెడ్డి వారిని నమ్మించారు. అనుకున్నట్టే బుధవారం సాయంత్రం నలుగురు ఎమ్మెల్యేలూ, నందు మొయినాబాద్లోని ప్రైవేట్ ఫామ్హౌస్కు చేరుకొన్నారు. ఇక రామచంద్ర భారతి ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చి, నేరుగా ఫామ్హౌజ్కు చేరుకోగా, సింహయాజి తిరుపతి నుంచి వచ్చారు. తర్వాత చర్చలు మొదలయ్యాయి. ‘ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 100 కోట్లు అందిస్తాం. ఏ రాష్ట్రంలో కావాలంటే ఆ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇస్తాం. మీకు ఏ పదవి కావాలో అది ఇప్పిస్తాం’ అని వారు ఆఫర్ చేశారు. ఎమ్మెల్యేలు వీటికి అంగీకరిస్తున్నట్టుగా నటిస్తూ చర్చను పొడిగించారు. ‘మీరు ఎలాగూ చేరుతున్నారు. అడ్వాన్స్గా నగదు తీసుకోండి. ఆ బ్యాగుల్లో క్యాష్ ఉంది. లెక్కపెట్టుకోండి’ అని కూడా స్వామీజీలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఈ తరుణంలో పోలీసులు రంగం ప్రవేశం చేసి కుట్రను బట్టబయలు చేసారు.