గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టులు, వన్డేలు మినహా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసే పనిలో ఉన్న సెలక్షన్ కమిటీ కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాజాగా బీసీసీఐకి చెందిన ఓ అధికారి పొట్టి ఫార్మాట్లో షమీ భవితవ్యాన్ని తేల్చేశారు.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ ప్రాబబుల్స్లో తాము షమీని పక్కనబెట్టామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘షమీని టెస్టులు, వన్డేలకు మాత్రమే ఆడిస్తున్నాం. టీ20లలో అతడు మా లిస్ట్లో లేడు. ఆ విషయం గతేడాది టీ20 ప్రపంచకప్నకు ముందే షమీతో చెప్పాం. పొట్టి ఫార్మాట్లో మా దృష్టంతా కుర్రాళ్ల మీదే ఉంది..’ అని కుండబద్దలు కొట్టేశాడు.
ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో అతడు భాగం కాకపోయినా వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్ జరగాల్సి ఉంది. ఆ టోర్నీలో మాత్రం టీమిండియా తరఫున షమీ పేరు ఉండే (ఇదే ఫామ్ కొనసాగిస్తే) అవకాశాలు మెండుగా ఉంటాయి.
టీ20లలో వెటరన్ అయినా భువనేశ్వర్ను కొనసాగిస్తున్న సెలక్టర్లు అతడికి తోడుగా పలువురు యువ బౌలర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్ లను ఆడిస్తున్నారు. బుమ్రా ఎలాగూ ఉండనే ఉన్నాడు కాబట్టి మూడో పేసర్ కోసం భారత్ ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నది. మరి ఈ ప్రయోగాలలో విజయవంతమయ్యేదెవరన్నది సెప్టెంబర్ మూడో వారంలో తెలుస్తుంది. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించేది అప్పుడే.