హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారుచేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్న మాటలపైనా కేటీఆర్ మండిపడ్డారు. కిషన్రెడ్డి వ్యాఖ్యలను కోట్చేస్తూ ఓ పత్రిక క్లిప్పింగ్ను ట్వీట్లో జతచేశారు. ‘మేక్ ఇన్ ఇండియా ఓ నినాదానికే పరిమితం. జాతీయ జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం మాత్రం నిజం. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కొన్నేండ్ల ముందే తెలిసినా, కనీసం జాతీయ జెండాలను కూడా సరిపడా సిద్ధం చేయలేకపోయారు. ఇదీ ఎన్పీఏ(నాన్ పర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వం గొప్పతనం. దార్శనికుడు విశ్వగురువుగారి సమర్థత. వాహ్..ఇది ఆత్మనిర్భరభారత్’అని ట్వీట్లో పేర్కొన్నారు.
గుడ్లక్ ఆండ్రూ ఫ్లెమింగ్.. మీ సేవలు అద్భుతం
హైదరాబాద్లో యూకే డిప్యూటీ హైకమిషనర్గా విధులు నిర్వర్తించిన ఆండ్రూ ఫ్లెమింగ్కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆండ్రూ ఫ్లెమింగ్ మంచి మిత్రుడు హైదరాబాద్లో ఐదేండ్లుగా యూకే డిప్యూటీ హై కమిషనర్గా ఉత్తమ సేవలందించారు. ఆండ్రూ, మీరు చాలా గొప్ప దౌత్యవేత్త. మీకు అభినందనలు. గుడ్లక్’ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.