మేం వ్యాట్ పెంచనే లేదు. ఎట్ల తగ్గిస్తం
పెట్రోల్పై రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని
మోదీ అనడంపై సీఎం కేసీఆర్ ధ్వజం
బీజేపీ 8 ఏండ్ల పాలనలో దేశంలో
ఎవరూ ఆనందంగా లేరని వ్యాఖ్య
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను ప్రధాని నరేంద్ర మోదీ నిందించడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఖాళీ డబ్బాలో గులకరాళ్లు వేసినట్టు ప్రసంగాలు చేయడం తప్ప ఈ ఎనిమిదేండ్లలో మోదీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. దేశంలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. విద్యుత్తు, సాగు, తాగునీరు, గృహనిర్మాణం, దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. దేశంలో జీడీపీ, ఎకానమి పడిపోయాయని, రేట్లు ఆకాశానికి అంటుతున్నాయని ధ్వజమెత్తారు. లేని దాన్ని ఉన్నట్టు నమ్మిస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మేం పన్నులు పెంచుతాం, రాష్ర్టాలు పన్నులు తగ్గించాలి’ అని మోదీ చెప్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. దేశంలో ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తు భయంకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రామా కాన్ఫరెన్స్
‘ఈ రోజు ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. డ్రామా కాన్ఫరెన్స్ నడిచింది. మూడు, నాలుగు గంటలు ముఖ్యమంత్రులు అందరూ కూర్చొని ఉండాలి. వాళ్లు చెప్పేది వినాలి. కరోనా మళ్లీ వస్తున్నది, దానికోసం చేపట్టాల్సిన జాగ్రత్తల మీద సమావేశం పెట్టారు. కానీ, మాట్లాడేది మాత్రం వేరు. రాష్ర్టాలు ట్యాక్సులు తగ్గించాలి అని. కనీసం చెప్పడానికి సిగ్గు, ఎగ్గు అయినా ఉండాలి కదా? ప్రజల మీద భారం వేయొద్దంటే మరి మీరెందుకు పెంచుతున్నరు. ఏ నోరుతో మీరు రాష్ర్టాలను తగ్గించమంటరు. ఇదేం నీతి. ఇంత దుర్మార్గమా? ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వెందుకు పెంచినవ్. దేనికోసం పెంచుతున్నవ్. లేని సెస్సులు ఎందుకు మోపుతున్నవ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. 2015లో ఒక్కసారి రౌండ్ ఫిగర్ చేయమని చెప్తే.. కొన్ని పైసలు అటూ ఇటూ చేసి సవరించాం అంతే. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డుగోలుగా పెంచిన పాపాత్మురాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఏ నోటితో తెలంగాణను ట్యాక్స్ కట్టాలని అడుగుతున్నరు. మేం పెంచనేలేదు. అలాంటిది మమ్మల్ని ఎలా తగ్గించమంటవ్’ అని కేసీఆర్ మోదీని నిలదీశారు.
హరీశ్రావు చెప్పినట్టు ‘బలమైన కేంద్రం.. బక్క రాష్ర్టాలు’.. మోదీ కుటిల నీతి అని కేసీఆర్ తెలిపారు. ఇంత నీచమైన పరిస్థితి దేశంలో ఎన్నడూ లేదని తెలిపారు. ఆకాశమెత్తు పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలతో ఆర్టీసీ బతకాలా? చావాలా? అని ప్రశ్నించారు. దాదాపు 2, 3 వేల కోట్లు ఇచ్చి ఆర్టీసీని బతికించుకొంటున్నామని గుర్తు చేశారు. ఆర్టీసీని జల్దీ అమ్మేయాలని మోదీ చెప్తున్నారని, అలా చేస్తే రూ.వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారని తెలిపారు. ఏ రాష్ట్రమైతే ప్రైవేటైజేషన్ చేస్తదో, అమ్ముతదో ఆ రాష్ర్టానికి ప్రైజ్ మనీ పెట్టిన ఘనుడు ప్రధాని మోదీ అని విమర్శించారు. ధరలు పెంచితే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇటీవలే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచామని, ఏడెనిమిదేండ్లలో ఎన్నడూ పెంచలేదని ఇదే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పామని తెలిపారు.
రూ. 27 లక్షల కోట్ల లెక్క చెప్పాలి..
మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మోదీ ప్రభుత్వంతో పోలిస్తే యూపీఏ హయాంలో పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం తక్కువగా ఉన్నదని కాంగ్రెస్ పేర్కొంది. పెట్రోల్, డీజిల్పై పన్నుల పేరిట కేంద్రం ఇప్పటివరకూ వసూలు చేసిన రూ. 27 లక్షల కోట్ల లెక్క చెప్పాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాల్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వాలు కారణంకాదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ విషయంలో రాష్ర్టాలను నిందించడం సరికాదన్నారు. కేంద్రం తమ రాష్ర్టానికి రూ. 26,500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉన్నదన్నారు. మహారాష్ట్రపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని తెలిపారు. కొవిడ్ భేటీ అని చెప్పి పెట్రోల్ ధరలపై ప్రధాని మాట్లాడటమేంటని బెంగాల్ సీఎం మమత అసహనం వ్యక్తం చేశారు. భేటీలో సీఎంలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్నారు.