నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ వెన్నులో వణుకు పుడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. తమ ఎనిమిదేండ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్లిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆదివారం నల్లగొండలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్ వంటి సంక్షేమ పథకాలను పక్క రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రజలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. లేదంటే సరిహద్దు ప్రాంతాలను తెలంగాణలో కలుపాలనే డిమాండ్ వస్తున్నదని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనకు వస్తున్న గుర్తింపును తట్టుకోలేకనే ప్రధాని మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. మోదీ పాలనపై విసుగు చెంది ప్రాంతీయ పార్టీల సీఎంలు బీజేపీ భరతం పట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ముంబై వెళ్లినట్టు తెలిపారు. పాలనలో మోదీ విఫలమయ్యాడని, ఏదో ఒకటి చేయాలని ఇతర రాష్ర్టాల నుంచి సీఎం కేసీఆర్కు ఫోన్లు వస్తున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.