హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అంటే భయమని, అందుకే కేసీఆర్ను ఏమీ చేయలేక ఆయన చుట్టూ ఉన్నవాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఆధారాలు లేని ఆరోపణలపై తాను భయపడే సమస్యేలేదని తేల్చిచెప్పారు. శనివారం ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. బీజేపీ అధికారం కోసమే రాష్ర్టాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారని, అందుకే బీజేపీ ఆయన కుటుంబసభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేసి గందరగోళం సృష్టించటం ద్వారా కేసీఆర్ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నదని చెప్పారు. ఒక్కరోజులోనే జార్ఖండ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టే నీచ రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని మండిపడ్డారు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ సోదాలు చేయిస్తున్నదని ఉదహరించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకొంటున్నదని ఆరోపించారు.
గతంలో దాడులు ఎదుర్కొన్నవారు బీజేపీలో చేరగానే పునీతులైనట్టు తయారైందని, ఆ పార్టీలో చేరిన తరువాత కేంద్ర మంత్రి పదవులు పొందారని, హిమంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్లు ఏకంగా అసోంకు సీఎం అయ్యారని వివరించారు. దేశంలో మోదీని ఎదుర్కొనే శక్తి ఒక్క సీఎం కేసీఆర్కే ఉన్నదనే విషయాన్ని బీజేపీ తెలుసుకొని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నదనే విషయం ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.