వేరే చోట నామినేషన్ వేస్తున్నారట కదా?
బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో మోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: నందిగ్రామ్లో తాను ఓడిపోతున్నట్టు మమతకు అర్థమైందని, అందుకే వేరే స్థానంలో మళ్లీ నామినేషన్ వేయడానికి ఆమె సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ‘దీదీ ఇది నిజమేనా?’ అంటూ ప్రశ్నించారు. ‘మొదట మీరు నందిగ్రామ్ వెళ్లారు. అక్కడ ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు. మీరు వేరే చోటికి వెళ్లినా అక్కడ కూడా మీకు సమాధానం ఇవ్వడానికి బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని అన్నారు. గురువారం జాయ్నగర్లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. బెంగాల్లో 294 స్థానాలకు గాను 200పైగా సీట్లలో తామే గెలుస్తామన్నారు. జై శ్రీరాం నినాదాలు, దుర్గా పూజలనే కాకుండా కాషాయం కట్టుకొనేవారిని కూడా మమత సమస్యలా భావిస్తున్నారని మోదీ అన్నారు. ‘కాషాయం కట్టుకొన్నవారిని వారు రాక్షసులు అన్నారు’ అని పేర్కొన్నారు.
కీలు బొమ్మల్లా కేంద్ర బలగాలు: మమత
నందిగ్రామ్: రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈసీ కూడా అమిత్ షా సూచనలనే పాటిస్తున్నదన్నారు. నందిగ్రామ్లో తాను తప్పక విజయం సాధిస్తానన్నారు. కాగా, నందిగ్రామ్లోని పోలింగ్ బూత్ నుంచి గురువారం ఆమె గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ఈసీ ఉన్నతాధికారికి ఫోన్ చేశారు.