కోల్కతా: పెట్రోల్ పెంపుల్లో ఉన్న ప్రధాని మోదీ హోర్డింగ్లను తక్షణమే తీసివేయాలని భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం ఎన్నికల సంఘాన్ని కలిశారు. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న ప్రధాని హోర్డింగుల్లో.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తున్నారని, ఇది ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని, అందుకే ఆ హోర్డింగ్లను తీసివేయాలని తమ ఫిర్యాదులో తృణమూల్ పేర్కొన్నది. ఆ ఫిర్యాదుకు స్పందించిన ఈసీ.. 72 గంటల్లోగా ఆ హోర్డింగ్లను తీసివేయాలని ఆదేశించింది. భారీ హోర్డింగుల్లో మోదీ ఫోటోలను వాడడం ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ సీఈసీ అధికారి కూడా తెలిపారు. ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. బెంగాల్లో మొత్తం 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.