పార్లమెంట్ అంటే లెక్కలేదు
కోర్టులంటే ఖాతరు లేదు..
విపక్షాల మాటకు విలువ లేదు
అసెంబ్లీ తీర్మానానికి ప్రాధాన్యం లేదు..
నేను మోనార్క్ని.. నేను ఏమి అనుకొంటే అది చేసి తీరుతాను..
నా మాటకు.. శాసనానికి తిరుగులేదు..
ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. విద్యుత్తు చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపించి నెలన్నర కూడా కాలేదు. బిల్లు ఇంకా స్టాండింగ్ కమిటీ పరిశీలనలోనే ఉన్నది. అంతలోనే.. మోదీ సర్కారు కరెంటుపై దొంగ దెబ్బతీసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు చట్టం సవరణ బిల్లులో పేర్కొన్న అంశాలన్నింటినీ దొడ్డిదారిన అమలు చేయడానికి సిద్ధపడింది. ఇందుకోసం ఏకంగా గెజిట్లను తీసుకొచ్చింది. స్టాండింగ్ కమిటీ ఏం నివేదిక ఇస్తుందో వేచి చూసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓపిక లేకుండా పోయింది.
పార్లమెంట్ సమావేశాలు లేని సమయాన్ని చూసి గెజిట్ల రూపంలో దారుణంగా దెబ్బతీసింది. ఇందులో ప్రధానమైన నాలుగు అంశాలు దేశంలో సామాన్యుడిపై అతి తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపించే దుస్థితి ఏర్పడుతుంది. ఇందులో ముఖ్యమైంది క్రాస్ సబ్సిడీ ఎత్తివేయడం. క్రాస్ సబ్సిడీ అంటే.. వాణిజ్య అవసరాలకు ఇచ్చే కరెంట్పై ఎక్కువ చార్జీలు వసూలుచేసి.. ఆ మేరకు పేదలు, రైతులు, గృహ వినియోగదారులపై సబ్సిడీ ఇవ్వడం. ఇప్పుడు కేంద్రం గెజిట్లు ఈ క్రాస్ సబ్సిడీకి మంగళం పాడాయి. దీంతో ఏ వర్గానికి కూడా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ఒక విధంగా రైతులతోపాటు వివిధ వర్గాలకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్తును ఇకపై ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. అన్నింటికీ మించి తెలంగాణ లాంటి రాష్ర్టాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై వేటు వేసే కుట్ర ఇది. డిస్కంలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడతారు. దీంతో విద్యుత్తు చార్జీలు ఇష్టారాజ్యంగా పెరుగుతాయి. బకాయిలు చెల్లింపు విధానం కఠినతరం చేయడం వల్ల విద్యుత్తు సంక్షోభానికి మోదీ సర్కారు తెరలేపుతున్నది. రెనివబుల్ ఎనర్జీ కొనుగోలు తప్పనిసరి చేయడం ద్వారా థర్మల్ విద్యుత్తును దెబ్బతీసే కుట్ర చేస్తున్నది.
176 సెక్షన్ అండతో..
అయితే ఎలాగైనా విద్యుత్తు సవరణ బిల్లును తీసుకొచ్చి.. తమ పథకం ప్రకారం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి విద్యుత్తు రంగాన్ని తీసుకురావాలనే దురుద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ సారథి మోదీ విద్యుత్తు చట్టం -2003లో ఉన్న ఒక సెక్షన్ను ఆసరాగా చేసుకొన్నారు. వాస్తవానికి పార్లమెంట్ ఆమోదించి, రాష్ట్రపతి సంతకం అయితే చట్టంగా రూపొందించి.. దర్జాగా సింహద్వారంలోంచే అమలు చేసే అవకాశం ఉండేది. కానీ సింహద్వారం మూసుకుపోయింది. స్టాం డింగ్ కమిటీ పరిశీలనలో ఉన్న ముసాయిదా బిల్లు ఎప్పుడు ఎలాంటి స్థితిలో బయటకు వస్తుందో లేదో తెలియదు. అందులో తమకు అనుకూలమైన అంశాలుకూడా ఉంటా యో.. లేదో నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్తు చట్టం -2003 లోని సెక్షన్ 176 ద్వారా తమకు దాఖలుపడ్డ అధికారాలను మోదీ సర్కారు ఉపయోగించుకొన్నది. స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉన్న విద్యుత్తు సవరణల బిల్లు-2022లోని ముఖ్యమైన అంశాలన్నింటినీ నోటిఫికేషన్లు, గెజిట్లు, రూల్స్ రూపంలో తీసుకొచ్చారు. దీంతో సవరణల బిల్లు మొత్తం వివిధ గెజిట్లు, నోటిఫికేషన్ల రూపంలో అమల్లోకి వచ్చిందనే స్పష్టంగా చెప్పవచ్చు. చట్టం రూపంలో తీసుకొనిరావాల్సిన దానిని.. దొడ్డి దారిలో ఉత్తర్వుల రూపంలో తెచ్చి యథాతథంగా అదే చట్టాన్ని అమలు చేస్తున్నారనడంలో రెండో అభిప్రాయానికి తావు లేదు.
డిస్కంల ప్రైవేటీకరణ
కేంద్రం జారీచేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా.. డిస్కంల స్థానంలో మరెవరైనా, ఏ కంపెనీ దరఖాస్తు చేసుకున్నా.. విద్యుత్తు పంపిణీకి సంబంధించిన లైసెన్సును జారీచేయాలి. డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులనేవి ఎన్నైనా ఉండవచ్చు. ఏ ప్రాంతానికైనా డిస్ట్రిబ్యూషన్గా ప్రైవేటు కంపెనీలు కొత్త అవతారం ఎత్తవచ్చు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు (ఈఆర్సీ) ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులను ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి (సీఈఆర్సీ)కి ఉన్న అధికారం పరిధిలో ఒక రాష్ట్రంలో ఒకరికంటే ఎక్కువగా ఇలా లైసెన్సులను ఇవ్వడం ద్వారా ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరిచినట్టే.
పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం..
తాజాగా కేంద్రం జారీచేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా.. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)/రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఆర్ఎల్డీసీ)లకు బకాయిల చెల్లింపులకు సంబంధించి అజమాయిషీ చేసే అధికారాన్ని కల్పించారు. ఒకవేళ బకాయిలను సకాలంలో చెల్లించకపోతే ఓపెన్ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేయనీయకుండా అడ్డుకోవచ్చు. నిజానికి ఎన్ఎల్డీసీ అనేది గ్రిడ్ వైఫల్యం చెందకుండా సాంకేతికంగా నిర్వహించడానికి ఏర్పడిన సంస్థ. ఎలాంటి వ్యాపారపరమైన, వాణిజ్యపరమైన అధికారాలు ఈ సంస్థకు లేవు. విద్యుత్తు కొనుగోలు చేసినందుకు చెల్లింపులనేవి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)ల ప్రకారం అమలవుతుంటాయి. కానీ తాజాగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రైవేటు విద్యు త్తు ఉత్పత్తి సంస్థలకు ఒక వరంగా మారి.. బకాయిల చెల్లింపును బూచిగా చూపి.. విద్యుత్తు కొనుగోలును అడ్డుకోవడం ద్వారా.. ప్రజల్లో, రాష్ర్టాల్లో అంధకారం అలుముకుంటుంది.
క్రాస్ సబ్సిడీ రద్దు
విద్యుత్తు సవరణల బిల్లు ప్రకారం.. క్రాస్ సబ్సిడీని తగ్గించుకోవాల్సి ఉంటుంది. నిజానికి సమాజంలో ఉన్న తారతమ్యాలను, సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వర్గాలకు విద్యుత్తు చార్జీల్లో కొంతమేర రాయితీలు ఇస్తుంటాయి. లేదా వ్యవసాయం లాంటి రంగాలకు తెలంగాణ లాగా పూర్తి ఉచితంగా ఇవ్వవచ్చు. అలాగే భారీ పరిశ్రమలు, ఇతర వర్గాల నుంచి కొంత ఎక్కువ ధరకు విద్యుత్తును అమ్ముతుంది. ఇలా వచ్చిన మొత్తంతో నిమ్న వర్గాలకు అందించే రాయితీని భర్తీ చేస్తుంది. కానీ తాజా ఉత్తర్వులతో వ్యవసాయం లాంటి వర్గాల నుంచి కూడా ముక్కుపిండి విద్యుత్తు చార్జీలను అందరితో సమానంగా వసూలు చేయాల్సి ఉంటుంది.
డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైసెన్స్ రూల్స్, 2022
ఈనెల 8న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే.. కొత్తగా రెండు గెజిట్లను జారీచేసింది. దీనివల్ల ప్రైవేటు సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్తు పంపిణీ వ్యవస్థలోకి వస్తాయి.
ఒక మున్సిపాలిటీ ప్రాంతంలోగానీ.. లేదా పక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాల పరిధిలోగానీ.. లేదా ఏదైనా చిన్న ప్రాంతం అయినా.. ప్రైవేటు లైసెన్సులు ఇవ్వడానికి వీలైనవిగా గుర్తించవచ్చు. ఇలా లైసెన్సులు ఇవ్వడం వల్ల.. ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన నెట్వర్క్ వ్యవస్థను ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే వినియోగించుకోవచ్చు. కేవలం రాయితీలు, సబ్సిడీలు పొందుతున్న వినియోగదారులు మాత్రమే ప్రభుత్వ డిస్కంల పరిధిలో గులుతారన్నమాట. కేవలం లాభార్జనే ధ్యేయంగా ఉండే ప్రైవేటు విద్యుత్తు డిస్ట్రిబ్యూటర్లు విద్యుత్తు చార్జీలను తమ ఇష్టారాజ్యంగా పెంచే అవకాశం ఉంటుంది.
ది ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ (అమెండ్మెంట్) రూల్స్, 2022 విద్యుత్తును (ఎనర్జీని) ఆడిట్ చేయాలి. సబ్సిడీ ఎవరికి ఎలా ఇస్తున్నారు? దీనిని ఎలా భర్తీ చేస్తున్నారనేది స్పష్టంగా ఉండాలని ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ ఆదేశించింది. ఎనర్జీ ఆడిటింగ్ ఉండాలంటే.. ప్రతి వినియోగదారునికి మీటర్ పెట్టాల్సిందే. అంటే.. వ్యవసాయరంగంలోనూ ప్రతి మోటర్కు మీటర్ పెట్టాల్సిందేనన్నమాట. ఈ ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్లో రాష్ర్టాల ప్రతినిధులు కేవలం సభ్యులుగా ఉంటారు.. కేంద్రం ప్రతినిధి మాత్రమే చైర్మన్గా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. కేంద్రం అనుకున్నదే చెల్లుతుంది.. అదే చట్టం అవుతుందన్నమాట. కేంద్రం జారీచేసిన గెజిట్లు, నోటిఫికేషన్లు, రూల్స్ రూపంలో అమలు చేయాల్సిందేనంటూ చెప్పిన అంశాలన్నీకూడా స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉన్న విద్యుత్తు సవరణల బిల్లు-2022లో పేర్కొన్నవే. అంటే చట్ట రూపంలో రాకున్నా.. వాటిని అమలు చేయాలని రాష్ర్టాలపై దాడి మొదలెట్టింది.
విపక్షాల అభ్యంతరాలకు విలువేది?
కేంద్రం రూపొందించిన విద్యుత్తు సవరణల బిల్లు-2022లో అనేక అంశాలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. విద్యుత్తు వ్యవస్థలను, రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికే సవరణల బిల్లును బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ దేశవ్యాప్తంగా దుమ్మెత్తి పోశారు. బీజేపీ మినహా పార్టీలన్నీ ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్సభ, రాజ్యసభల్లో తీవ్ర విమర్శలను కేంద్రం ఎదుర్కొన్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్తు అంశంపై రాష్ర్టాలతో చర్చించకుండానే.. బిల్లును రూపొందిస్తారా అని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన విద్యుత్తు సవరణల బిల్లు-2022 ను స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించింది.
రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్..
నిజానికి ప్రతి రాష్ర్టానికి రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సంబంధించి భౌగోళికంగా కొన్ని అడ్డంకులు, పరిమితులు ఉన్నాయి. కానీ ఇవేమీ దృష్టిలో పెట్టుకోకుండా.. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేంద్రం ప్రతి రాష్ట్రం నిర్దేశిత మొత్తంలో రెన్యూవబుల్ విద్యుత్తును కొనుగోలు చేయాలని (ఆర్పీపీవో) ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ నిర్దేశిత పరిమాణంలో విద్యుత్తును కొనుగోలు చేయకపోతే.. ఒక్కో యూనిట్కు రూ. 0.25 పైసల నుంచి రూ. 0.50 పైసల వరకు పెనాల్టీగా విధిస్తారని ఆదేశించారు. దీనివల్ల ఆయా రాష్ర్టాల్లోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. దీనివల్ల ఫిక్స్డ్ కాస్ట్ ల రూపంలో విద్యుతు ధర పెరుగుతుంది.
కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యం
ఏ దారి అయితే ఏంది.. మనం అనుకున్నది చేయాలి. మనల్ని నమ్ముకున్న కార్పొరేట్ శక్తులకు విద్యుత్తు రంగాన్ని కట్టబెట్టాలి. దాని కోసం ఏ దారి అయినా ఉపయోగించుకొంటం.. విద్యుత్తు వినియోగదారుల నుంచి మొదలుకుని.. విద్యుదుత్పత్తి, డిస్కంలు, రెన్యూవబుల్ ఎనర్జీ, బకాయిల వసూలు.. ఇలా ప్రతి అంశమూ కార్పొరేట్ శక్తుల చెప్పుచేతల్లోకి రావాల్సిందే. కేవలం సబ్సిడీకి చెందిన వినియోగదారులు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉండాలి.. మిగతావన్నీ కార్పొరేట్ పరం కావాలి. ఇదీ స్థూలంగా కేంద్రంలోని మోదీ సర్కారు అంతిమ లక్ష్యం. పలు గెజిట్లు, ఉత్తర్వులు, నోటిఫికేషన్లు, నిబంధనలపేరుతో స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉన్న విద్యుత్తు సవరణల బిల్లు -2022లోని ప్రధాన అంశాలన్నింటినీ అమల్లోకి తేవడం కేంద్ర ప్రభుత్వం దాష్టీకానికి పరాకాష్ట.