న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కంపెనీలు నడిపిస్తున్నాయని, బీజేపీ కాదని రైతు సంఘాల నేత రాకేశ్ టికాయిత్ విమర్శించారు. సోమవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ఉద్దేశాన్ని ప్రశ్నించారు. వాటితో రైతులు ఏం ప్రయోజనం పొందారన్నారు. సింఘులో జరిగిన హత్యపై స్పందిస్తూ.. ఇది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. ఇందులో రైతులు, వారి ఉద్యమానికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు ముగియవని, షరతులతో చర్చలు జరుగవన్నారు. నిరసనలతో సామాన్యులు సమస్యలు ఎదుర్కొంటున్నారా? అనే ప్రశ్నకు.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఇతర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరికీ మేం వ్యతిరేకమన్నారు. తాను పొలిటికల్ లీడర్ను కాదని.. రాజకీయాలతో సంబంధం లేదన్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం కచ్చితంగా వెనక్కి తీసుకుంటుందని, ‘మీరు చూస్తారు’ అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.