కరెంట్ సంక్షోభం చుట్టుముట్టిన తర్వాత మోదీ సర్కార్ హడావుడి
కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్లాన్
ఒడిశాలో 1,320 మెగావాట్ల కొత్త ప్లాంటు
లారా, సింగ్రౌలీ ప్రాజెక్టులు తిరిగి నిర్మాణం
ఎన్టీపీసీ నిర్ణయం.. ఈ నెలలోనే కాంట్రాక్టులు
పునరుత్పాదక ఇంధనంతో కరెంటు ఉత్పత్తి పెంచుతామని బీజేపీ ప్రభుత్వం గొప్పలు
ఆ వైపు వేగంగా పడని కేంద్రం అడుగులు
న్యూఢిల్లీ, మే 4: దూపైనప్పుడే బాయి తవ్వాలి. ఆకలైనప్పుడే పొలం నాటెయ్యాలి అన్నట్టుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. కరెంటు కటకటతో దేశమంతటా చీకట్లు అలుముకొంటే తప్ప కేంద్రానికి విద్యుత్తు విలువ తెలిసిరాలేదు. ఏటికేడు డిమాండ్ పెరుగుతున్నదన్న సంగతి గుర్తుకు రాలేదు. డిమాండ్ తగినట్టు విద్యుత్తు ఉత్పత్తికి పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాలేదు. పరిస్థితిని ముందే గుర్తించిన తెలంగాణ సర్కారు.. విద్యుత్తు సమస్యకు శాశ్వత పరిష్కారం చేసింది.
ప్రభుత్వ విద్యుత్తు సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా యాదాద్రి పవర్ ప్లాంట్తోపాటు పలు ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. కానీ కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం దేశాన్ని విద్యుత్తు సంక్షోభం చుట్టేసిన తర్వాత ఇప్పుడు హడావుడిగా కొత్త పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల విస్తరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఒడిశాలో 1,320 మెగావాట్ల ప్లాంట్కు ఈ నెలలోనే కాంట్రాక్టును ఓకే చేయనున్నట్టు సమాచారం. అలాగే గతంలో వద్దనుకున్న లారా, సింగ్రౌలి ప్లాంట్ల నిర్మాణాన్ని కూడా తిరిగి ప్రారంభించనున్నారు.
గడిచిన ఆరేండ్లలో ఎన్టీపీసీ ప్రారంభించనున్న కొత్త థర్మల్ ప్రాజెక్టు ఒడిశాలో కొత్తగా నిర్మించనున్న ప్లాంటే. మరోవైపు, కరెంటు సంక్షోభంపై కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ నెల 2న పవర్ ప్రాజెక్టులు, రాష్ర్టాల అధికారులతో సమావేశం అయ్యారు. నిరుపయోగంగా ఉన్న 5 గిగావాట్ల ప్లాంట్లలో నెల రోజుల్లోగా విద్యుదుత్పత్తిని ప్రారంభించాలన్నారు.
బొగ్గు నుంచే ఎక్కువ..
దేశంలో సగం కన్నా ఎక్కువ విద్యుత్తుత్పతి బొగ్గు నుంచే జరుగుతున్నది. దీన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధనాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నది. కానీ ఆ దిశగా అడుగులు వేగంగా వేయలేదు. ఫలితంగా బొగ్గు మీద ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొన్నది. కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి. దేశం స్తంభించింది. ఫలితంగా విద్యుత్తుకు డిమాండ్ తగ్గింది. దీంతో లారా, సింగ్రౌలీ ప్రాజెక్టులను ఎన్టీపీసీ నిలిపివేసింది.
బొగ్గును నిందించడం సరికాదు
సంప్రదాయేతర ఇంధన వనరుల వైపు కేంద్రం అడుగులు అనుకొన్నంత వేగంగా పడని నేపథ్యంలో బొగ్గు అవసరాన్ని గుర్తించాలని విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘పాత థర్మల్ పవర్ ప్లాంట్ల స్థానంలో కొత్త టెక్నాలజీతో ప్లాంట్లను ఏర్పాటు చేస్తే తక్కువ బొగ్గుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు’ అని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ శ్రీకాంత్ అన్నారు.