న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే పార్బాయిల్డ్ బియ్యానికి మినహాయింపునిచ్చారు. దేశంలో ప్రస్తుత వానకాలం సీజన్లో వరి పంట విస్తీర్ణం తగ్గడం కారణంగా చూపింది. స్వదేశీ బియ్యం సరఫరాను మెరుగు పర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
వరిధాన్యం, పాలిష్ చేసిన బియ్యం, పాలిష్ చేయని బ్రౌన్ రైస్పై 20 శాతం కస్టమ్స్ సుంకం విధించనున్నట్టు రెవెన్యూ విభాగం జారీచేసిన నోటిఫికేషన్లో తెలియజేశారు. పార్బాయిల్డ్, బాస్మతీ బియ్యానికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. 9వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొన్ని రాష్ర్టాల్లో వర్షాలు పడని కారణంగా మొత్తంగా దేశంలోని వరి విస్తీర్ణం 5.62 శాతం తగ్గి 383.99 లక్షల హెక్టార్లకు పడిపోయిందని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల దక్షిణాది ముడిబియ్యం ఎగుమతిపై ప్రభావం పడుతుందని అఖిలభారత బియ్యం ఎగుమతిదార్ల సంఘం అధ్యక్షుడు నథీరాం గుప్తా అన్నారు. పార్బాయిల్డ్ బియ్యం ఎగుమతి మాత్రం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.