కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 2, 3 తేదీల్లో కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నట్టుగా జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (NCRB) నివేదిక వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నట్లు, కేంద్రానికి సంబంధమే లేదన్నట్లు వ్యవహరించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, కేంద్ర బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాకే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నట్లు, 2014 ముందు దేశంలో గాని, రాష్ట్రంలో గాని ఆత్మహత్యలు లేవన్నట్లు గా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏమం టే తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి.
భారత్ వ్యవసాయిక దేశం. బంగారు పంటలు పండించే మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశం. కానీ కేంద్ర ప్రభుత్వం మూలంగా వ్యవసాయరంగం క్రమంగా సంక్షోభంలోకి నెట్టబడి దేశంలో ప్రతి అర గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజు సుమారు 2,000 మంది వ్యవసాయరంగాన్ని వదిలి ఇతర రంగాలకు వలసపోతున్నారు. వ్యవసాయరంగంలో వచ్చిన ఈ సంక్షోభం భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదకరమైనది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటుతున్నా ఇప్పటికీ 63 శాతం, అంటే సుమారు 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
హోంశాఖలో భాగమైన NCRB విభాగం దేశంలో జరుగుతున్న వివిధ రకాల ఆత్మహత్యలను 1995 నుంచి నమోదు చేస్తున్నది. అందులో భాగంగానే దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల వివరాలను సేకరించి ఏడా దికోసారి ఆ వివరాలను విడుదల చేస్తుంది. NCRB వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశంలో 1995 నుంచి 2013 వరకు 18 ఏండ్లలో దేశవ్యాప్తంగా 2,96,466 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత 8 ఏండ్లలో 89,174 రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? (వివరాలు పక్కనున్న బాక్సులో..)
అదే NCRB నివేదిక ప్రకారం 1995 నుంచి 2013 వరకు తెలంగాణ ప్రాంతంలో 25,987 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేండ్లలో 6,473 మంది రైతు లు ఆత్మహత్య చేసుకున్నారు. 2014లో 1347 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, అది క్రమేణా 2020 వచ్చేసరికి 471కి తగ్గింది. 2021లో ఈ సంఖ్య 352కి పరిమితమైంది. అంటే తెలంగాణ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా?
కేంద్ర ప్రభుత్వ పెద్దలు రైతు ఆత్మహత్యలన్నింటినీ రాష్ర్టాల ఖాతాలోకి నెట్టి ఆత్మహత్యలలో తమ ప్రమేయం లేనట్టుగా వ్యవహరిస్తు న్నారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ చట్టాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచింది. వారిని ఆదుకునే విషయంలో మాత్రం మొండిచెయ్యి చూపుతున్నది. 22 రకాల పంటలకు మాత్రమే మద్ద తు ధరలను ప్రకటిస్తుంది. 2014లో సాగు ఖర్చుతో పోలిస్తే పంటల మద్దతు ధర పెరగకపోవడం గమనార్హం. 2014లో వరి సాగుకు ఎకరానికి ఖర్చు రూ.18,000 కాగా, 2022లో అది రూ.35,600లకు చేరింది. 2014-15లో వరి క్వింటాలు మద్దతు ధర రూ.1310 కాగా, 2021-22లో అది రూ.1940 (ఎనిమిదేండ్లలో రూ.630 మాత్రమే పెరిగింది.)
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ సంక్షోభంలోకి నెడుతున్నది. 2014లో బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తామని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ ఊసేలేదు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రెండేండ్లుగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభు త్వం కొనకపోవడంతో రైతులు కల్లాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు.
ఆత్మహత్యల నివారణకు సూచనలు: వ్యవసాయరంగ రుణాలన్నింటిని మాఫీచేయాలి. బ్యాంకులు వడ్డీ లేని రుణాలివ్వాలి. ఎరువులు, పురుగుల మందులపై రాయితీ పెంచాలి. పంటలన్నింటికీ మద్దతు ధర ఇచ్చి ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు పెట్టుబడి ఖర్చుల మీద 50 శాతం పెంచి మద్దతు ధర ఇవ్వాలి. పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్రమే చెల్లించి దేశవ్యాప్తంగా అమలు చేయాలి. దేశవ్యాప్తంగా కుటుంబ ఆధారంగా రైతు బీమాను (తెలంగాణ ప్రభుత్వం వలె) అమలుచేయాలి. పార్లమెంటులో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. పార్లమెంటు సమావేశాల్లో సగం రోజులు వ్యవసాయ రంగంపైనే చర్చలు జరపాలి. అప్పుడే రైతు ఆత్మహత్యలు తగ్గి దేశం అన్నపూర్ణగా మారు తుంది.
– పులి రాజు
99083 83567