భారతదేశ భద్రతతో పాటు పౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రతీది బహిరంగ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నది. కాబట్టి డేటా రక్షణ పటిష్టంగా ఉండాలి. కానీ కేంద్రం డేటాను రక్షించాల్సిందిపోయి, విచ్చలవిడిగా, తమకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్రం చేపడుతున్న కొన్ని పనులు దేశంలో వ్యక్తిగత సమాచారంపై భద్రత కొరవడిందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్ వాడుతున్న దేశంగా చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా మనం ఇంటర్నెట్లో అన్వేషిస్తున్నాం. మన సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నాం. చౌకధరల దుకాణాల నుంచి కార్పొరేట్ ఆఫీసుల దాకా అన్నిచోట్లా వ్యక్తుల వేలిముద్ర కీలకమైంది. ఏ అప్లికేషన్ అయినా ఆధార్, ఓటర్ కార్డులనందిస్తున్నాం. అంటే ప్రతి చోటా మన వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తున్నాం. అయితే, మన సమాచారం భద్రంగానే ఉంటున్నదా? దీని గురించి తెలియనివాళ్లే చాలామంది ఉన్నారు. వాస్తవానికి మనం బయట ఇచ్చే ప్రతీ వ్యక్తిగత సమాచారం చాలా కీలకమైనది. అది ఏ మాత్రం లీకైనా చాలా ప్రమాదాలు జరగొచ్చు. మన సమాచారం పార్టీల చేతుల్లోకి వెళ్లి వారి ప్రచారానికి మనమే అస్త్రంగా మారొచ్చు. నేరస్థుల చేతికి వెళ్తే మనం ఆన్లైన్ దోపిడీకి గురికావచ్చు.
వ్యక్తిగత సమాచారం ఇంత కీలకంగా మారిన ఈ రోజుల్లో కేంద్రం చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు కారణమవుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది. ఇదే క్రమంలో ‘హర్ ఘర్ తిరంగా’ అంటే ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం అని ఓ నినాదాన్నిచ్చింది. అయితే, ఇది అక్కడితో ఆగితే అనుమానాలు వచ్చేవి కావు.
కానీ ప్రతీ ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరేయాలని, దానిపక్కన నిలబడి ఫొటో తీసి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఫొటోను జియోట్యాగింగ్ కూడా చేయాలన్నది. అంటే మనం ఏ ప్రాంతం నుంచి ఫొటో తీసి పంపిస్తున్నామో ఆ ప్రాంతం వివరాలన్న మాట. అంటే అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మనం ఉంటున్న ప్రాంత వివరాలు కూడా అందులో కచ్చితంగా నమోదు చేయాలి.
అనుమానం, భయాలకు కారణమేమిటి: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఇచ్చిన పిలుపుతో స్వాతంత్య్ర దినోత్సవం రోజు దాదాపు 6 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఫొటోలు అప్లోడ్ చేశారు. ఇందులో 5 కోట్ల మంది జియో ట్యాగింగ్ కూడా చేశారు. అంతేకాదు, తమ ఫోన్ నంబర్లను వెబ్సైట్లో రిజిష్టర్ చేసుకున్నారు. అయితే.. డిజిటల్ రైట్స్ కార్యకర్తలు ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంత ప్రమాదకరమా..?
ఇంటర్నెట్ వాడకం పెరిగిన తరుణంలో వ్యక్తిగత సమాచార అమ్మకం ఓ పెద్ద వ్యాపారమైంది. సైబర్ నేరగాళ్లే కాదు, వ్యాపారవర్గాలకూ ప్రజల డేటా కీలకంగా మారింది. తమ వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి ఎక్కువగా ఈ డేటానే ఆధారం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలకు అంతకంటే ఎక్కువ అవసరం ఏర్పడింది. ఒక ప్రాంతం, ఒక వర్గం.. వారి వ్యవహారశైలి ఆధారంగా ప్రకటనలను మొబైల్ఫోన్లలోకి పంపడం ఇప్పుడు సాధారణమైపోయింది. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా చేపట్టిన ఫొటో అప్లోడ్ కార్యక్రమంలో కూడా ఇదే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జియో ట్యాగింగ్తో ఫొటోలు అప్లోడ్ చేయాలన్న సూచన వెనక అసలు ఉద్దేశం ఇదేనని సాంకేతిక నిపుణులు, డేటా ప్రైవసీ హక్కుల కోసం పోరాడుతున్నవారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో డేటా అంతా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసులోకి చేరిపోయే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు.
దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మరింత ప్రమాదకరం. మతపరంగా, పార్టీపరంగా వ్యక్తులను లక్ష్యంగా చేసే ప్రమాదమూ లేకపోలేదు. గతంలోనూ చాలా దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. గయానా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇలాంటి ప్రయత్నమే జరిగింది. 2015లో గయానా అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన డేవిడ్ గ్రాంగెర్ లొకేషన్ బేస్డ్గా క్యాంపెయిన్ చేశారని టెక్సాస్ వర్సిటీ పరిశోధనలో తేలింది. అలాగే 2020లో అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాంకేతిక పరిజ్ఞానంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని విమర్శలొచ్చాయి. చర్చికి వెళ్లే క్యాథలిక్ల వివరాలు సేకరించి వారిని లక్ష్యంగా చేసుకొని ప్రకటనలు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వర్గంలోని ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకే క్యాథలిక్ల మొబైల్ డివైజ్లకు ప్రకటనలు పంపారని చెప్తుంటారు.
చట్టాలు ఏం చెప్తున్నాయ్?
సాంకేతిక విప్లవం తర్వాత చాలా దేశాలు డేటా ప్రైవసీకి చట్టాలు చేశాయి. ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు ఏవైనా సరే ప్రజల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ మన దేశంలో డేటా ప్రైవసీకి పటిష్ఠమైన చట్టం అంటూ ఏదీ లేదు. 2019లోనే డేటా ప్రైవసీ చట్టం తీసుకొచ్చినా, అది పార్లమెంట్ ఆమోదం పొందలేదు. ఈ బిల్లులో చాలా లోపాలున్నాయని ప్రతిపక్ష నేతలు, నిపుణులంటున్నారు.
ఈ బిల్లులో ప్రజల వ్యక్తిగత సమాచారంపై ప్రైవేటు కంపెనీల హక్కుల విషయంలో ఆంక్షలు పెట్టడం బాగానే ఉన్నా, ప్రభుత్వానికి వెసులుబాట్లు కల్పించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డేటాను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వాడుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ కోసం ప్రజలు ఇచ్చిన ఐరిస్, వేలిముద్రలు, ఫొటోలు.. ఇలా అన్నింటిని తమకు ఇష్టం వచ్చినట్టు వాడుకునేలా కేంద్రం ప్రణాళికలు రచించిందని విపక్షాలు ఆరోపించాయి. మరోవైపు… ఈ బిల్లుపై కేంద్రం నియమించిన కమిటీ కూడా ఇందులో 99 సెక్షన్లలో 81 సవరణలు సూచించింది. దీంతో బిల్లు మళ్లీ వెనక్కివెళ్లిపోయింది. ఓ వైపు ఆన్లైన్లో ఉన్న వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదు. దాన్ని కాపాడేందుకు రూపొందించిన చట్టం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే దేశంలో ఆధార్ డేటా లీక్ అయిందనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత కొవిడ్ పేషంట్ల డేటా ఉన్న వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయని వార్తలొచ్చాయి. ఇలా నిత్యం ప్రజల వ్యక్తిగత సమాచారం లీకవుతూనే ఉన్నది. ఇప్పుడు కేంద్రం ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో మరోసారి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని లొకేషన్తో సహా సేకరించింది. ఇది ఏ మేరకు భద్రంగా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇంటర్నెట్ వాడకం పెరిగిన తరుణంలో వ్యక్తిగత సమాచార అమ్మకం ఓ పెద్ద వ్యాపారమైంది.
సైబర్ నేరగాళ్లే కాదు, వ్యాపారవర్గాలకూ ప్రజల డేటా కీలకంగా మారింది. రాజకీయ పార్టీలకు అంతకంటే ఎక్కువ అవసరం ఏర్పడింది. ఒక ప్రాంతం, ఒక వర్గం.. వారి వ్యవహారశైలి ఆధారంగా ప్రకటనలను మొబైల్ఫోన్లలోకి పంపడం ఇప్పుడు సాధారణమైపోయింది. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా చేపట్టిన ఫొటో అప్లోడ్ కార్యక్రమంలో కూడా ఇదే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– వై.సతీష్రెడ్డి 96414 66666
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్)