హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): చేనేత రంగ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. కేంద్రం వారికి సంబంధించిన వివిధ పథకాలను రద్దు చేసి నేతన్నల నడ్డి విరుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. చేనేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీ విధించడంతోపాటు ఆలిండియా హ్యాండీక్రాఫ్ట్, పవర్లూమ్ బోర్డులతోపాటు పొదుపు భద్రతా పథకాన్ని రద్దు చేసిందని చెప్పారు. వివిధ రకాల ఆంక్షలతో కనీసం నూలు కూడా దొరకనివ్వడం లేదన్నారు. రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా చింతా ప్రభాకర్ బుధవారం నారాయణగూడలోని టెస్కో భవన్లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేటీఆర్, మహమూద్అలీ, హరీశ్రావులతోపాటు ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, ఫారూఖ్ హుస్సేన్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు హాజరై చింతా ప్రభాకర్ను అభినందించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ర్టానికి రోజుకొక కేంద్ర మంత్రి వస్తున్నప్పటికీ నిధులు మాత్రం తేవడం లేదని, వరంగల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎల్ఐసీ, రైల్వేస్టేషన్లను అమ్ముతున్న ప్రధాని మోదీ..మేకిన్ ఇండియా అంటూ చివరకు జాతీయ జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకున్నారని విమర్శించారు.
నేతన్నలకు రాష్ట్ర సర్కారు అండ
నేతన్నలు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో నే వారికి అభయం ఇచ్చారని, ఆ మేరకు వారి సం క్షేమానికి పెద్దపీట వేశారని హరీశ్రావు చెప్పారు. భూదాన్పోచంపల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారి గుర్తుచేశారు. నేతన్నలకు పని కల్పించాలనే లక్ష్యంతో ఏటా రూ.350 కోట్లతో బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమ య్యే వస్ర్తాల ఆర్డర్ ఇస్తున్నట్టు తెలిపారు. రూ.5 లక్షల నేతన్న బీమా పథకం, సబ్సిడీపై నూలు, రంగులు, పొదుపు పథకం తదితర అనేక సం క్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు చెప్పారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ చెప్పారు. కార్యక్రమంలో చేనేత, వస్త్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.