చండీగఢ్/బెంగళూరు: డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్న రైతులకు ఆసరాగా ఉండాల్సింది పోయి, వారిని ముప్పుతిప్పలు పెడుతున్నది. బీజేపీ పాలిత హర్యానా, కర్ణాటకలో రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. అటు హర్యానాలో ఇచ్చిన హామీనే తుంగలో తొక్కి వేల మంది జొన్న రైతులకు చెల్లింపులు చేయకుండా మోసం చేస్తున్నది. ఇటు కర్ణాటకలో పెసర్ల కొనుగోలులో ఆలస్యం చేస్తూ రైతులతో ఆడుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాల దగాపై రెండు రాష్ర్టాల్లో రైతులు ఆందోళనల బాటపట్టారు.
2 వారాలుగా చెల్లింపుల్లేవ్..
హర్యానాలోని రోహ్తక్, జజ్జర్, రేవారీ, మహేంద్రగఢ్ జిల్లాలకు చెందిన 11 వేల మంది జొన్న రైతులు హర్యానా స్టేట్ కో ఆపరేటివ్ సైప్లె అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్(హెచ్ఏఎఫ్ఈడీ)కు ఈ నెల మొదట్లో తమ పంట అమ్మారు. రెండు వారాలు గడిచినా, ప్రభుత్వం ఇప్పటికీ వారికి చెల్లింపులు చేయలేదు. పంట సేకరించిన 72 గంటల్లోనే డబ్బులు ఇస్తామని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతకుముందు ఆర్భాటంగా ప్రకటించేసుకొన్నది. కానీ ఇప్పటి వరకు చెల్లింపులే జరగలేదు. కర్ణాటక రైతుల పరిస్థితి మరోలా ఉన్నది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు కారణాలను సాకుగా చూపుతూ పెసర్ల కొనుగోలులో ఆలస్యం చేస్తున్నది.