న్యూఢిల్లీ, జూలై 22: ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై విపక్ష పార్టీ నేతల నిరసనలతో శుక్రవారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు రణరంగాన్ని తలపించాయి. లోక్సభ స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ, శివసేన, డీఎంకే, ఆరెస్పీ తదితర పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అటు రాజ్యసభలోనూ నిరసనలు కొనసాగాయి. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిర్వహించారు. అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడింది.
అంటార్కిటిక్ బిల్లుకు లోక్సభ ఆమోదం
అగ్నిపథ్ నిరసనల కారణంగా జూన్ 15 నుంచి 23 మధ్య 2,132 రైళ్లు రద్దయ్యాయని, దీంతో ప్రయాణికులకు రూ. 102.96 కోట్లను రీఫండ్ చేసినట్టు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంట్కు తెలిపారు. ఆందోళనల కారణంగా రూ. 259.44 కోట్ల రైల్వే ఆస్తులు ధ్వంసమైనట్టు వెల్లడించారు. ప్యాసింజర్ రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలేమీ లేవని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అర్హతలున్నప్పటికీ దాదాపు 4 కోట్ల మంది ఇంకా ఒక్క డోసు కరోనా టీకా కూడా తీసుకోలేదని కేంద్రం తెలిపింది. అంటార్కిటిక్లో జీవవైవిద్యాన్ని, వాతావరణాన్ని కాపాడటం, అక్కడి మన పరిశోధన సంస్థలను భారత చట్టాల పరిధిలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు, 2022కు లోక్సభ ఆమోదం తెలిపింది.
ప్రచారానికి రూ. 900 కోట్లు
2019లో రెండోసారి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు ప్రకటనల కోసం రూ. 900 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభకు వెల్లడించారు. న్యూస్ పేపర్లు, టీవీ చానల్స్, వెబ్ పోర్టల్స్లో ఈ ప్రకటనలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా రూ. 690.83 కోట్లను ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం వెచ్చించినట్టు వెల్లడించారు.