న్యూఢిల్లీ: ఎన్నికల కమినర్గా ఓ ప్రభుత్వాధికారిని ఎలా నియమిస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గోవాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం తమ న్యాయశాఖ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల కమిషనర్లుగా స్వతంత్ర వ్యక్తులే ఉండాలి తప్ప ప్రభుత్వం నియమించిన వాళ్లు కాదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం స్వతంత్రతను ప్రశ్నార్థకం చేయకూడదు. ఓ ప్రభుత్వాధికారికి ఎన్నికల కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించడం అనేది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని గోవాలో ఎన్నికల కమిషన్కు ఇన్ఛార్జ్గా నియమించడం కలవరపరుస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికలపై హైకోర్టు నిర్ణయాన్ని కూడా ఆ అధికారి కొట్టేసే ప్రయత్నం చేసినట్లు ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతోంది.