న్యూఢిల్లీ: టెక్ దిగ్గజాలు శ్యామ్సంగ్, ఆపిల్ తదితర సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాలను మిస్ అవుతున్నట్లు వెల్లడించాయి. చిప్ల కొరత, కరోనా మహమ్మారి ప్రభావంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై నిషేధం, చైనా దిగ్గజం హువావేపై అమెరికా నిషేధం దీనికి కారణాలు.
అయితే, దేశీయంగా స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ)’ అమలు చేస్తున్నది. ఈ పథకం కింద దేశీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి వచ్చిన 16 ప్రతిపాదనలకు అనుగుణంగా గత అక్టోబర్ నెలలో్ కేంద్రం ఆమోదం తెలపడంతోపాటు రూ.11 వేల కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద వచ్చే ఐదేండ్లలో రూ. 10.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.
చైనా టెక్ దిగ్గజం ‘హువావే’కు ఎలక్ట్రానిక్ చిప్స్, ప్రాసెసర్ల సరఫరాపై గత సెప్టెంబర్ నుంచి అమెరికా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో హువావే సంస్థ యాజమాన్యం.. అంతకుముందే రెండేండ్లకు సరిపడా చిప్లను దిగుమతి చేసుకున్నది.
ముందస్తుగా హువావే రెండేండ్లకు సరిపడా చిప్లను దిగుమతి చేసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చిప్ల కొరత తీవ్రంగా ఉన్నదని ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రో ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా భారత కంపెనీలకు వివిధ దేశాల సంస్థలు 97 శాతం చిప్ల సరఫరా నిలిపివేశాయని చెప్పారు.
కరోనా మహమ్మారి వల్ల కేంద్ర ప్రభుత్వ ‘పీఎల్ఐ’ పథకం ప్రకటించడానికి 4 నెలల ముందే పలు స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల కార్యకలపాలు స్తంభించిపోయాయి. దీనికి అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం, ఇతర లాజిస్టిక్ సమస్యలు తోడయ్యాయి.
గత అక్టోబర్ ఏడో తేదీ నాటికి పీఎల్ఐ పథకం కింద క్వాలిపికేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ల తయారీకి అవసరమైన సామగ్రి సేకరణ కోసం సంబంధిత కంపెనీలతో చర్చలు జరిపి, ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునేందుకు చాలా తక్కువ టైం మాత్రమే ఉన్నదని ఐసీఈఏ తెలిపింది.
ఐసీఈఏలో ఆపిల్, ఫాక్స్కాన్, విస్ట్రాన్, లావా తదితర సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇక ఫాక్స్కాన్ హోన్ హాయి, విస్ట్రాన్, పెగట్రోన్లకు భారత్లో తమ ఐ-ఫోన్లను తయారు చేయడానికి ఆపిల్, రైజింగ్ స్టార్ సంస్థకు శ్యామ్సంగ్ సంస్థ తమ ఫోన్ల ఉత్పత్తికి కాంట్రాక్టులు ఇచ్చాయి. సిబ్బందిపై వేధింపులు, వేతనాల్లో అవకతవకల నేపథ్యంలో బెంగళూరులోని విస్ట్రాన్ సంస్థపై ఆపిల్ నిఘా పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే, కరోనా, ఇతర ఇబ్బందుల వల్ల చిప్స్ కొరత తలెత్తినందున ఉత్పాదక లక్ష్యాలను చేరుకోలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ శావనేయ్కు రాసిన లేఖలో ఐసీఈఏ సభ్య సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐఎల్ఐ పథకం లక్ష్యాలను కొన్ని సంస్థలు మాత్రమే చేరుకోగలవని పంకజ్ మొహింద్రో తెలిపారు. కనుక కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ల అమలు సమయాన్ని సర్దుబాటు చేయాలని కోరారు.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శ్యామ్సంగ్ మాత్రమే పీఎల్ఐ లక్ష్యాలను చేరుకోగలుగుతుందని ఇండస్ట్రీ వర్గాల కథనం. వచ్చే ఐదేండ్లలో శ్యామ్సింగ్ రూ.3.7 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఇందులో రూ.2.2 లక్షల కోట్ల విలువ గల ఫోన్లలో రూ.15వేల లోపు విలువ గలవే ఉంటాయని తెలుస్తున్నది.
మోటార్ ఫీల్డ్కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్ల ధరలు పైపైకి..!!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!