ముంబై : తమ పార్టీ నేత రాజ్ ఠాక్రేకు ఎవరైనా హాని తలపెడితే మహారాష్ట్ర భగ్గుమంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరిట ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో పోస్టర్ వెలిసింది. రాజ్ ఠాక్రే వెంట్రుక ఊడినా మహారాష్ట్ర ప్రతీకారంతో రగులుతుందని నినదిస్తూ ఎంఎన్ఎస్ ప్రతినిధి సంతోష్ నలవదే లాల్బాగ్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్లో ఠాక్రే ఆయన కుమారుడు అమిత్, ఎంఎన్ఎస్ నేత బాల నంద్గోంకర్ ఫోటోలున్నాయి.
కాగా రాజ్ ఠాక్రే జూన్ 5న అయోధ్య సందర్శిస్తుండగా బీజేపీ యూపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆయనకు అల్టిమేటం జారీ చేశారు. అయోధ్యలో అడుగుపెట్టే ముందు గతంలో ఆయన ఉత్తరాది వారిని చులకనగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మసీదుల్లో లౌడ్స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర సర్కార్కు రాజ్ ఠాక్రే డిమాండ్ చేసిన నేపధ్యంలో ఎంఎన్ఎస్ శ్రేణులు తమ అధినేతకు బాసటగా నిలిచాయి. ఠాక్రే డిమాండ్ను బీజేపీ కూడా సమర్ధిస్తోంది. ఇక హిందుత్వ అనుకూల వైఖరి నుంచి దూరం జరిగిన శివసేనపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.