ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పెద్ద మనసును చాటుకోవాలంటూ ఎంఎన్ఎస్ కార్యకర్తలు కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి ‘బిగ్ బీ… పెద్ద మనసు చేసుకోండి..’ అంటూ బుధవారం రాత్రి ముంబై జుహులోని ఆయన ఇంటి ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంఎన్ఎస్ నేత మనీష్ ధురి మాట్లాడుతూ సంత్ జ్ఞానేశ్వర్ రోడ్డు విస్తరణ కోసం బృహన్ ముంబై కార్పొరేషన్ 2017లో అమితాబ్ బచ్చన్తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. విస్తరణ కోసం అందరు సహకరించినా బిగ్ బీ స్పందించలేదని.. దీనిపై బాలీవుడ్ సూపర్ స్టార్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
ఈ మేరకు ఆయన ఇంటి ఎదుట ప్లకార్డులు ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణకు సంబంధించి బీఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా.. అమితాబ్ స్పందించకపోయినా.. ఈ విషయంపై బీఎంసీకి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ట్రాఫిక్ సమస్యను పరిష్కారానికి రోడ్డు విస్తరణ కోసం అమిత్ బంగ్లా గోడను పడగొట్టాలని బీఎంసీ ప్రణాళిక వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ రోడ్డు 45 అడుగులు ఉండగా.. దాన్ని 60 అడుగులకు విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది.