పట్టభద్రులకు అండగా ఉంటా
ఎమ్మెల్సీ వాణీదేవి వెల్లడి
బేగంపేట్, మార్చి 21: ‘నా విజయం మా నాన్నకు అంకితం. పట్టభద్రుల సంక్షేమానికి ప్రభుత్వం చేయాల్సిన దానికోసం నేను వకాల్తా పుచ్చుకుంటా’ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి చెప్పారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వాణీదేవి ఆదివారం నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో తన తండ్రి, మాజీ ప్రధాని పీవీ నరిసింహారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక సైన్యాధిపతిగా ముందు నిలిచి తనను గెలిపించేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషిని మరువలేనన్నారు.
ఈ విజయం తనపై మరింత బాధ్యతను మోపిందని చెప్పారు. ‘నా పై సీఎం కేసీఆర్కు విశ్వాసం ఉంది కాబట్టి.. టికెట్ ఇచ్చి, గెలిపించి, బాధ్యతను అప్పగించారు. ఇది నా జీవితంలోనే మరచిపోలేని మధుర ఘట్టంగా భావిస్తున్నా’నని చెప్పారు. ఆమె వెంట గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్, సోలార్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శేఖర్ మారంరాజుతోపాటు అర్చక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.