నాగర్కర్నూల్ : శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంభ అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదన్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి దయ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రజలందరూ బాగుండాలని ప్రార్థించాను. శ్రీశైలం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తిరుమల మాదిరిగానే శ్రీశైలం సన్నిధి కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కవిత తెలిపారు.