జగిత్యాల: దేశంలో నిరుద్యోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని, ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోదీ హైతో ముష్కిల్ హై.. పాతాల్ మే జీడీపీ హై.. ఆస్మాన్మే బే రోజ్గార్ హై.. అని ప్రధానిని విమర్శించారు. మోదీ హయాంలో పెట్రోల్ నుంచి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయని చెప్పారు.
జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీలు కవిత, ఎల్ రమణ, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. వాళ్లు జై శ్రీరాం అంటే మనం జై హనుమాన్ అనాలని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.
తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసమని, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామని వెల్లడించారు. స్థానికతకు సంబంధించిన జీవో రెండేండ్ల పాటు కేంద్రం పెండింగ్లో పెట్టినా ఓపిక పట్టామని చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలని సూచించారు. గతంలో 7 వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం 281 బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేశామని కవిత అన్నారు. రూ.1300 కోట్లతో లక్షా 32 వేల వెనుకబడిన తరగతుల విద్యార్థులను చదివిస్తున్నామని వెల్లడించారు. 96 లక్షల విద్యార్థులకు రూ.8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చామని తెలిపారు.
రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని చెప్పారు. అవినీతి రహితంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డలకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. దళితబంధు పథకం దేశంలో ఎక్కడా లేదని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై ప్రతి గ్రామంలో చర్చపెట్టాలని సూచించారు. దేశంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
ఎంపీ అర్వింద్ అబద్ధాలకు ప్రతిరూపమని కవిత విమర్శించారు. పనిచేయ చేతగాదు కానీ అబద్ధాలు చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్ధం వెళ్లి అద్దంలో చూసుకుంటే అరవింద్ కనిపించాడంటా అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో గెలిచినవాళ్లకు మర్యాద ఇవ్వాలని.. అందుకే అరవింద్కు మూడేండ్లు అవకాశం ఇచ్చామన్నారు. అయినా రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్ఎస్ చేసిన పనులను కూడా తామే చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని వెల్లడించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరని కవిత ప్రశ్నించారు. పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించరని, ఇరు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమోనని సందేహం వ్యక్తంచేశారు. కాంగ్రెసోళ్లు గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలన్నారు. తెలంగాణకు రావాల్సిన బకాయిలపై పార్లమెంటులో మాట్లాడాలని రాహూల్ను జీవన్రెడ్డి కోరాలని డిమాండ్ చేశారు.