హైదరాబాద్ : బాల గంగాధర తిలక్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మీర్పేట పరిధిలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బాల గంగాధర తిలక్ తనకు స్ఫూర్తి అన్న కవిత.. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు.
గణేశ్ ఉత్సవాలు నిర్వహించి, ప్రజలను ఒక దగ్గర చేర్చి, స్వాతంత్ర్యం కోసం ఎందుకు కొట్లాడాలో బాల గంగాధర తిలక్ ప్రజలకు వివరించే వారని తెలిపారు. దానిపై అధ్యయనం చేసిన తర్వాతనే తెలంగాణలో ఇలా ఎందుకు చేయకూడదు? అనే ఆలోచన వచ్చి.. ఉద్యమ సమయంలో బతుకమ్మ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు కవిత చెప్పారు. పూలనే దేవుడిగా పూజించే బతుకమ్మలాంటి పండుగ తెలంగాణలో తప్ప.. ప్రపంచంలో మరెక్కడా లేదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్సీ బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం శంషాబాద్ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత, యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.