హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుపై వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానం రావాల్సిందేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై కవిత ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందించారు. బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే అసలు వీళ్లు తెలంగాణ బిడ్డలేనా అని అనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని సీఎం కేసీఆర్ రైతుల పక్షాన సోమవారం స్పష్టంగా డిమాండ్ చేశారని చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని, ఆ రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వం వడ్లు 100 శాతం కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ తీసుకోవాలని డిమాండ్ చేశారు.