లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్త
వరదలపై అధికారులతో ఎమ్మెల్సీ కవిత సమీక్ష
స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తు, కలెక్టర్కు ఆదేశాలు
నిజామాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా జెడ్ చొంగ్తులతో సోమవారం ఆమె ఫోన్లో హైదరాబాద్ నుంచి మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అతి భారీ వర్షాలతో అల్లాడుతున్న ప్రాంతాల్లో అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు.
దురదృష్టవశాత్తు ప్రజలకు ఏమైనా జరిగినా వెంటనే వారిని దవాఖానలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దన్నారు. నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వరద ముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి క్రిస్టినా చొంగ్తూ ఉభయ జిల్లాల్లో పర్యటించారు. కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.