నందిగామ, ఆగస్టు 21: సమాజంలోని అశాంతిని తొలగించాలంటే ధ్యానం ఒక్కటే సహజమైన మార్గమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామంలోని ధ్యాన కేంద్రంలో ఆదివారం హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం హార్ట్ఫుల్ నెస్ ధ్యాన గురువు కమలేశ్ డి పటేల్తో కలిసి వివిధ రాష్ర్టాలకు చెందిన యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు, డైరెక్టర్లకు నేషన్ హ్యాపినెస్ యూనికార్న్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ పటేల్ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు.
ఈ సహజ ధ్యాన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఎంచుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుకూలంగా హరితహారంలో భాగంగా కన్హ గ్రామంలో ఎంతో అద్భుతంగా మొక్కలు నాటడాన్ని ఆమె అభినందించారు. గత నాలుగేండ్లుగా వరుసగా కన్హ గ్రామానికి హరితహారం అవార్డులు రావడాన్ని ఆమె ప్రశంసించారు. కార్యక్రమంలో ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ది, యువర్ వన్ లైఫ్ యోగి కోచార్, దేశంలోని పలు యూనివర్సిటీల చైర్మన్లు, డైరెక్టర్లు, హార్ట్ఫుల్నెస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.