హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): హోలీ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతిరాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో దినదినాభివృద్ధి సాధిస్తూ, అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని మంత్రి ప్రశాంత్రెడ్డి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయని మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకొని హోలీ ప్రాముఖ్యతను చాటాలని పిలుపునిచ్చారు. చిన్నా, పెద్ద, ఆడా, మగ తేడాలేకుండా ఉత్సాహంగా జరుపుకొనే హోలీ పండుగలో సహజమైన రంగులనే వాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఓ వీడియో సందేశం ద్వారా ఆమె రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకొనే పరిస్థితి ఉన్నదని ఆమె పేర్కొన్నారు.