హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్గా భూపాల్ రెడ్డి నియామకం అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్గా నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపట్నుంచి ప్రొటెం చైర్మన్గా భూపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ కావడంతో ప్రొటెం చైర్మన్ను గవర్నర్ నియమించారు. మండలికి చైర్మన్ను ఎన్నుకునే వరకు భూపాల్ రెడ్డి ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్తో పాటు మరో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం నేటితో ముగిసింది.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్లకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి వీడ్కోలు పలికారు.
దేశంలో రాజ్యసభ, లోక్సభ, రాష్ర్టాల్లో శాసనమండలి, శాసనసభల్లో రెండు పదవులు ఒకేసారి ఖాళీ అయిన సందర్భాలు ఉన్నాయి. 1977లో ఫకృద్దీన్ అలీ అహమ్మద్ రాష్ట్రపతి పదవిలో మరణించారు. అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వీడీ జెట్టి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ అయినట్టయింది. అదే సమయంలో రాజ్యసభ వైస్ చైర్మన్గా ఉన్న గోడె మురహరి లోకసభకు ఎన్నికయ్యారు. అప్పుడు బనారసీదాస్ రాజ్యసభకు చైర్మన్ ప్రొటెమ్గా నియమితులయ్యారు. 1981లో కర్ణాటక శాసనమండలిలో చైర్మన్, వైస్చైర్మన్గా కొనసాగుతున్న శంకర్మూర్తి పదవీకాలం ముగిసింది. అప్పు డు బసవరాజు అనే మండలి సభ్యుడిని చైర్మన్ ప్రొటెమ్గా అప్పటి ప్రభుత్వం నియమించింది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చైర్మన్ చక్రపాణి, వైస్ మహమ్మద్ జానీ పదవీకాలం ఏకకాలంలో ముగిసింది. చైర్మన్ ప్రొటెమ్గా బసవపున్నయ్య నియమితులయ్యారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పదవీ కాలం ఈ నెల 24తో ముగిసింది. అక్కడ డిప్యూటీ చైర్మన్గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ నెల 18తో ముగుస్తుంది. అంటే అక్కడ చైర్మన్ ప్రొటెమ్గా ఎవరినో ఒకరిని నియమించే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఏపీలో శాసనమండలికి ఇలా ఏకకాలంలో అటు చైర్మన్కు, ఇటు వైస్ చైర్మన్ పదవీ కాలం పూర్తి అయిన సందర్భాలు లేవు. శాసనసభకు మాత్రం 1981లో ఇటువంటి పరిస్థితే ఉత్పన్నమైంది. అప్పుడు ప్రభుత్వం మూర్తిరాజు అనే శాసనసభ్యుడిని ప్రొటెమ్ స్పీకర్గా నియమించింది. మూర్తి రాజు ఏడు నెలలపాటు ఆ పదవిలో ఉన్నారు. మధ్యప్రదేశ్లో గౌతమ్ అనే ఎమ్యెల్యే పది నెలలు ప్రొటెమ్ స్పీకర్గా వ్యవహరించారు.
కొత్తగా ఎన్నికయ్యే మండలి సభ్యుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించడం, కొత్త చైర్మన్ను ఎన్నుకోవటం, ఇతర మండలి వ్యవహారాలు చూసుకొంటారు. సాధారణ చైర్మన్, స్పీకర్కు ఉండే అన్ని అధికారాలుంటాయి. ఎస్కార్ట్, ప్రొటోకాల్, జీతభత్యాలు, బంగ్లా సౌకర్యాలు, గౌరవాలుంటాయి.