సికింద్రాబాద్, సెప్టెంబర్ 16: కండ్లుండి చూడలేని కబోదుల్లా బీజేపీ నేతలు తయారయ్యారని, అబద్దాలతోనే పబ్బం గడుపుకుంటున్నారని కమలం పార్టీపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు కంటోన్మెంట్లో రోజులుగా ప్రజల మద్దతు లేకపోవడం తో బండి సంజయ్కు మతి భ్రమించి, సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెంట్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత తాగునీటి పథకానికి ఏడాదికి సుమారు రూ.18కోట్ల భారాన్ని భరించి సర్కారు అమలు చేస్తుందన్నారు.
కంటోన్మెంట్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు ‘బండి’కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసు కోకుండా బండి సంజయ్ మూర్ఖుడిలా వాగుతున్నాడని మండిపడ్డారు. సుమారు రూ.136కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామని, నూతనంగా దాదాపు 5వేల మందికి ఆసరా పింఛన్లు ఇచ్చామన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ చార్జీల బకాయిలను విడుదల చేయిస్తానని బీరాలు పలుకుతున్న బండి సంజయ్, నిజంగానే రూ.700కోట్ల బకాయిలను తెప్పిస్తే సలాం కొడుతానని ఎమ్మెల్యే సాయన్న సవాల్ విసిరారు. లేని పక్షంలో బండి తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రక్షణ శాఖ పాలనలో ఉన్న కంటోన్మెంట్కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. దేశంలోని 62 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎక్కడైనా ఉచిత నీటి సరఫరా పథకం అమలవుతుందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై బండి సంజ య్ ఇష్టానుసారం మాట్లాడడం మంచి పద్ధ్దతి కాదని హెచ్చరించారు. కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో కంటోన్మెంట్ ఉన్నప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతోందని, రామన్నకుంటకు దాదావు రూ.4కోట్లు, ప్యాటీ నాలా వంతెనకు రూ.10కోట్లు కేటాయించి పనులు చేపట్టామన్నారు. కంటోన్మెంట్ ప్రాంతం మీదుగా మేడ్చల్, శామీర్పేట్ వైపు రెండు మార్గాల్లో స్కైవేలను ఏర్పాటు చేస్తామని కేంద్రాన్ని అనుమతి కోరితే సమాదానం లేదని సాయన్న తెలిపారు.కార్యక్రమంలో నేతలు మధుకర్, టీఎన్ శ్రీనివాస్, సదానంద్గౌడ్, తేజ్పాల్ పాల్గొన్నారు.