హైదరాబాద్ : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ పద్దులపై మాట్లాడారు. పల్లె ప్రగతితో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు నిర్మించడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సీజనల్ వ్యాధులను పూర్తిగా అరికట్టగలిగామని తెలిపారు. పల్లె ప్రగతితో డెంగీ మరణాలు పూర్తిగా తగ్గాయని స్పష్టం చేశారు.
గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యం నేడు పల్లెల్లో కనబడుతుందన్నారు. అయితే సర్పంచ్లను దృష్టిలో ఉంచుకుని బకాయిలను త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ శాఖను మార్కెటింగ్ శాఖకు అనుసంధానం చేసి.. పంటల ఉత్పత్తులు ఉన్న ప్రాంతాల్లో రోడ్లు వేసి.. మార్కెట్లకు కూరగాయలను, ఇతర ఉత్పత్తులను తరలించేలా ఏర్పాటు చేయాలన్నారు. బ్రిడ్జిల నిర్మాణం కూడా చేపట్టాలని ఎమ్మెల్యే వెంకటవీరయ్య విజ్ఞప్తి చేశారు.